స్వరాష్ట్రంలో ప్రజలకు పాలనను చేరువ చేసేందుకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వసతుల కల్పనకూ అంతే ప్రాధాన్యం ఇచ్చుకుంటూ వస్తున్నది. ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు నిర్మిస్తున్నది. యాదాద్రి భువనగిరి జిల్లాలో సమీకృత కలెక్టరేట్ అందుబాటులోకి కూడా వచ్చింది.ఈ క్రమంలో జిల్లా కోర్టుల ఏర్పాటు దిశగానూ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. అందులో భాగంగా కోర్టు కాంప్లెక్స్ల నిర్మాణానికి స్థలాలను కేటాయిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
యాదాద్రి జిల్లాలో భువనగిరి మండల పరిధిలోని రాయగిరిలో పదెకరాలు, సూర్యాపేట జిల్లాకు సంబంధించి చివ్వెంల మండల పరిధిలోని కుడకుడలో ఆరెకరాలకు అనుమతి ఇచ్చింది. నిర్మాణం ప్రారంభించి, త్వరితగతిన పూర్తిచేయడం ద్వారా న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తేనున్నది.
నల్లగొండ ప్రతినిధి, మే26(నమస్తే తెలంగాణ) : నూతన జిల్లా కేంద్రాల్లోనూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే యాదాద్రి జిల్లాలో ఆధునిక వసతులతో నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. సూర్యాపేట జిల్లాలోనూ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు కొత్త భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
కొద్ది నెలల్లోనే వీటి నిర్మాణాలు పూర్తి చేసేందుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఇదే సమయంలో న్యాయవ్యవస్థను నూతన జిల్లాల వారీగా విశదీకరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాత జిల్లా కేంద్రాల్లో మాదిరిగానే అన్ని కొత్త జిల్లాల్ల్లో కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటికి పక్కా భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ గతంలోనే ఆదేశించారు. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కోర్టు కాంప్లెక్స్ల నిర్మాణానికి ప్రభుత్వ స్థలాల సేకరణ బాధ్యతలను ఆయా జిల్లాల కలెక్టర్లకు అప్పగించారు.
దాంతో యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. దీని ప్రకారం ఆయా జిల్లాలకు స్థలాలను కేటాయిస్తూ గురువారం జీఓ నంబర్ 52ను ప్రభుత్వం జారీ చేసింది. యాదాద్రి జిల్లా కోర్టు కాంప్లెక్స్ నిర్మాణం కోసం భువనగిరి మండలం రాయగిరిలో సర్వేనంబర్ 742లో 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తున్నట్లు జీఓలో పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించి చివ్వెంల మండలంలోని కుడకుడలో సర్వే నంబర్ 163లో 6 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ స్థలాల్లో త్వరలోనే కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి కావాల్సిన చర్యలను చేపట్టున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దాంతో ఆయా జిల్లాల పరిధిలోని న్యాయవాదులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.