నేరేడుచర్ల/ హుజూర్నగర్/ చిలుకూరు, మే 25 : రైతుల పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులను సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్లో కొత్త ఆప్షన్లు ఇచ్చి సిటిజన్ లాగిన్లో దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు 35 అంశాలు ఉండగా, మరో 11అంశాల కొత్త మాడ్యుల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో తిరస్కరణకు గురవుతున్న భూ దస్ర్తాల సమస్యల పరిష్కారానికి అవకాశం కలుగనుంది.
ధరణి వెబ్సైట్లో ఆప్షన్ల మార్పు అందుబాటులోకి వచ్చింది. మీ సేవ కేంద్రాల్లో లేదా నెట్ సెంటర్లలో రైతులు దరఖాస్తు చేసుకునే అవకాశమిచ్చారు. చేయదలచిన ఆప్షన్ క్లిక్ చేసి వివరాలు నమోదు చేయాలి. దరఖాస్తుదారులు కొత్త పాస్ పుస్తకాలు, పహాణీ, ఆధార్ కార్డులను వెంట తీసుకెళ్లాలి. రూ.1045 చెల్లించి దరఖాస్తు చేసుకున్న తర్వాత అప్లికేషన్ పెండింగ్ ఎట్ కలెక్టర్ అని చూపిస్తుంది. ఆ సమయంలో మీ సేవ కేంద్రం లేదా నెట్ సెంటర్ వారు ఇచ్చే స్లిప్ను తీసుకొని తాసీల్దార్ను కలువాలి. వారు పరిశీలించి నిబంధనల మేరకు మార్పులు, చేర్పులు చేస్తారు.
చాలా సంవత్సరాల నుంచి ఉన్న భూ సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్లో కొత్త ఆప్షన్లు తీసుకురావడం రైతులకు ఎంతగానో ప్రయోజనకరం. ఒకప్పుడు భూమి సమస్యలు ఉంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరిగేది. కానీ.. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ దక్షతతో ఆన్లైన్, మీ సేవలో దరఖాస్తు చేసుకుంటే అధికారులు వెంటనే సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు.
– కొండా వెంకటేశ్వర్లు, రైతు, చిలుకూరు మండలం
ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణిలో కొత్త ఆప్షన్ల వల్ల రైతులు ఏ సమస్య ఉందో దానికే ఆన్లైన్, మీ సేవలో తగిన పత్రాలతో పోర్టల్లో దరఖాస్తు చేసుకునే సదుపాయం కలిగింది. దీంతో భూ సమస్యలు తొందరగానే తీరనున్నాయి. అధికారులకు కూడా పరిష్కారం సులువుగా దొరుకుతుంది.
– రాజేశ్వరి, తాసీల్దార్, చిలుకూరు