సమైక్య పాలనలో నిర్వీర్యానికి గురైన ఆలయాలు స్వరాష్ట్రంలో పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయని,
సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించి వాటి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం అర్వపల్లి మండల కేంద్రంలోని యోగానంద లక్ష్మీనృసింహస్వామి ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో కలిసి పాల్గొన్నారు. యంత్రస్థాపన, మహాకుంభాభిషేకం, ధ్వజస్తంభం, విమాన శిఖరాల ప్రతిష్ఠ పూజలు చేసి ఆలయ ఆవరణలో మండపాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్వపల్లి ఆలయం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తన నిధుల నుంచి 1.20 కోట్లు మంజూరు చేశారని, వాటితో ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించారని అన్నారు.
అర్వపల్లి, మే 25 : సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే పురాతన ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం అర్వపల్లి మండల కేంద్రంలోని యోగానంద లక్ష్మీనృసింహ స్వామి దేవాలయంలో జరిగిన పునఃప్రతిష్ఠా మహోత్సవంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సమైక్య పాలనలో తెలంగాణలోని పురాతన ఆలయాలన్నీ విధ్వంసానికి గురయ్యాయని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలోని పురాతన ఆలయాలన్నింటినీ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేస్తున్నారని అన్నారు. అర్వపల్లి ఆలయం అభివృద్ధి కోసం సీఎం తన నిధుల నుంచి రూ.1.20 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలో అతిపురాతనమైన ఈ ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి పూర్వవైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ను ఒప్పించి సరిపడా నిధులు మంజూరు చేయించి ఆలయాన్ని అధునాతనంగా తీర్చిదిద్దుతామన్నారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తన తండ్రి మారయ్య జ్ఞాపకార్థం రూ.20 లక్షలతో ఆలయ ఆవరణలో నిర్మించిన ధ్వజస్తంభానికి పూజలు చేసిన అనంతరం భక్తుల జయజయధ్వానాల నడుమ మంత్రి జగదీశ్రెడ్డి ప్రతిష్ఠించారు. ఆలయంలో యంత్రస్థాపన, మహాకుంభాభిషేకం అనంతరం ఆలయంపై విమాన శిఖరాలను ప్రతిష్ఠించి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో నిర్మించిన మండపాన్ని ప్రారంభించారు.
కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరైన మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే కిశోర్కుమార్ను వేదపండితుల ఆశీర్వచనంతోపాటు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగేంధర్రావు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, ఆర్టీఐ కమిషనర్ కట్టా శేఖర్రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సభ్యుడు ఒంటెద్దు నర్సింహారెడ్డి, జడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, ఆలయ కమిటీ చైర్మన్ చిల్లంచర్ల విద్యాసాగర్, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.