ఆత్మకూరు(ఎం), మే 24 : గ్రామాల అభివృద్ధిలో భాగంగా మండలంలోని కొరటికల్కు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో గ్రామంలోని ఎనిమిది వీధుల్లో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టారు. గతంలో ఉన్న మట్టి రోడ్లు నేడు సీసీ రోడ్లుగా మారడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కొరటికల్ గ్రామంతోపాటు గ్రామపంచాయతీ పరిధిలోని రేగులకుంట, ఇప్పల్ల గ్రామాల్లో రూ. 65 లక్షలతో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు నిర్మించారు. దాంతో నేడు గ్రామంలో ఎటు చూసినా రోడ్లు దర్శనమిస్తుండడంతో ప్రజలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు.
గ్రామంలో అవసరమైనచోట సీసీ రోడ్లు నిర్మించడంతోపాటు మురుగునీటి కోసం అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టడంతో ఊరు మంచిగా మారింది. గతంలో మట్టి రోడ్లతో ఇబ్బంది పడేవాళ్లం. నేడు సీసీ రోడ్ల నిర్మాణంతో ఆ బాధ తొలిగింది.
-ఖమ్మంపాటి స్వామి, గ్రామస్తుడు
గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం 3 ఏండ్లల్లో రూ.65లక్షలు మంజూరు చేయడంతో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టాం. ప్రభుత్వ సహకారంతో మున్ముందు మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతాం.
-కోల సత్తయ్యగౌడ్, సర్పంచ్, కొరటికల్
సీసీ రోడ్ల నిర్మాణంతో గ్రామం పరిశుభ్రంగా కనిపిస్తున్నది. గతంలో మట్టిరోడ్లు ఉన్నప్పుడు దుమ్ము, ధూళితోపాటు వానకాలంలో వీధులన్నీ బురదమయంగా మారి నడిచేందుకు ఇబ్బందిగా ఉండేది. ఇప్పడు సీసీ రోడ్లతో బురద నుంచి విముక్తి కలిగింది.
-కుమ్మరికుంట్ల సాయమ్మ, గ్రామస్తురాలు