పెన్పహాడ్, మే 24 : నిత్యం ప్రజల మధ్యే ఉండే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి మరొకమారు జనంలోకి వెళ్లి మాట కలిపారు. మంచీచెడు అర్సుకొన్నారు. పెన్పహాడ్ మండలంలోని భక్తళాపురంలో మంగళవారం ఓ చెట్టు నీడన గ్రామస్తులు, మహిళలు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. పెన్పహాడ్ నుంచి మునగాల మండలానికి వెళ్తున్న మంత్రి జగదీశ్రెడ్డి వారినిచూసి, కారు దిగి దగ్గరకు వెళ్లారు. ‘ఏం పెద్దమ్మా, ఏం తాత’ అంటూ ఆప్యాయంగా పలుకరించారు.
అందరూ బాగున్నారా! గ్రామంలో ఏమైనా సమస్యలున్నాయా!! అని అడిగి తెలుసుకున్నారు. ఊళ్లో సమస్యలేవీ లేవని, డబుల్ బెడ్రూం ఇండ్లు, కొత్త పింఛన్లు ఇవ్వాలని కొందరు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి గుంటకండ్ల స్పందిస్తూ.. ప్రజా అవసరాలను గుర్తించి అడుగక ముందే సీఎం కేసీఆర్ అన్నీ ఇస్తున్నారని పేర్కొన్నారు. అర్హులందరికీ ఇండ్లు, పింఛన్లు వస్తాయని హామీనిచ్చారు. ఏడేండ్లలోనే ఎంతో అభివృద్ధి సాధించుకున్నామని, అనే అంశాల్లో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని వివరించారు.