హుజూర్నగర్ రూరల్ : ప్రభుత్వ ఆధీనంలోని గుట్టలు, ఏనె భూములకు రక్షణ కరువైంది. పలువురు వ్యాపారులు ఈ భూముల మట్టిని రాత్రి పగలు తేడాలేకుండా యథేచ్ఛగా మట్టిని తరలించుకుపోతుండగా, వాటి చుట్టూ ఉన్న రైతులు ఆక్రమిస్తూ తమ పొలంలో కలిపేసుకుంటున్నారు. మండలంలోని లింగగిరి గ్రామ రెవెన్యూ పరిధిలో సుమారు 80 నుంచి 100 ఎకరాల విస్తీర్ణంలో రాళ్లు, చెట్ల పొదలతో కూడిన ఏనె భూములు విస్తరించి ఉన్నాయి. ఇవి శ్రీనివాసపురం, అమరవరం, యాతవాకిళ్ల చెరువు సమీపం వరకు విస్తరించాయి.
ఈ భూములే ఇప్పుడు కొంతమంది కబ్జాదారులకు ఆక్రమణగా మారాయి. లింగగిరి-శ్రీనివాసపురం మధ్య ఉన్న ప్రధాన రహదారికి ఆనుకుని సర్వే నంబర్ 216లో 8 ఎకరాల 20 సెంట్ల విస్తీర్ణంలో ప్రభుత్వానికి చెందిన ఏనేకర్రలు త్వరలోనే కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చాయి. ప్రతి వేసవిలో వీటిని ఆనుకుని ఉన్న పొలాల రైతులు కొంతమేర రాళ్లు తొలగించి చదునుచేసి ఆ భూములను తమ పొలాల్లో కలుపుకుంటున్నారు. దీంతో రెండు వారాల వ్యవధిలో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలోని ఏనె భూముల్లో మట్టి, రాళ్లు మాయమయ్యాయి. ఎకరా భూమి రూ. 25 లక్షల నుంచి 30 లక్షలు పలుకుతుండటంతో ప్రతియేటా ఈ ఏనె భూములను కలుపుకుంటూ ఆక్రమణదారులు తమ భూములను పెంచుకుంటున్నారు.
ఏనేకర్ర భూములు ఎక్కువ విస్తీర్ణంలో ఉండటంతో అక్కడక్కడా ఆక్రమణలు జరుగుతున్నాయి. చుట్టుపక్కల ఉన్న రైతులు కొంతమంది రాళ్లు, మట్టి తొలగించి భూములను కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు రైతులు తమ పొలాలకు అవసరం ఉందని మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం ఉంది. మట్టిని తొలగించొద్దని సిబ్బంది ద్వారా ఇప్పటికే తెలియపరిచాం. ప్రభుత్వ భూములను కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఆక్రమణకు గురైన భూములను గుర్తించి త్వరలోనే వాటికి హద్దులు నిర్ణయిస్తాం.
– తాసిల్దార్ జయశ్రీ