వానకాలం పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. విత్తనాలు వేసేందుకు దుక్కులను సిద్ధం చేస్తున్నారు. దున్నకాలు, విత్తనాలు, ఎరువులు తదితర ఖర్చుల కోసం పెట్టుబడి అవసరం కానున్న
నేపథ్యంలో రైతుబంధును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. సాగుకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఎనిమిది సీజన్లలో పంట పెట్టుబడి సాయం అందించగా, ఈ వానకాలంలోనూ ఆసరాగా నిలిచేందుకు నిర్ణయించారు.
ఆ మేరకు ఇప్పటికే రైతుబంధు పొందుతున్న రైతులు అవసరమైతే తమ బ్యాంకు ఖాతాలు మార్చుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. త్వరలో ఈ సీజన్కు సంబంధించిన విధివిధానాలు వెలువడనున్నాయి. అనంతరం రైతుల జాబితాను అధికారులు సిద్ధం చేయనున్నారు. అందులో అర్హులైన కొత్తవారికీ అవకాశం కల్పించనున్నారు. గత ఎనిమిది విడుతల్లో ఉమ్మడి జిల్లాలో 9.56లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7930 కోట్లను పంట పెట్టుబడిగా అందించింది.
నల్లగొండ ప్రతినిధి, మే 24(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక లాంటి రైతుబంధు పథకం మరో విడత అమలుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సీజన్ ప్రారంభంలోనే పథకం అమలు చేయడం ద్వారా రైతులకు భరోసానిచ్చే ఆస్కారం ఉన్నది. ఈలోగా రైతులకు ప్రభుత్వం ఇప్పటికే ఓ అవకాశం కల్పించింది. ఇప్పటివరకు రైతులు పెట్టుబడిసాయంగా వస్తున్న నగదు జమకు వినియోగిస్తున్న బ్యాంకు ఖాతా లను మార్పు చేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది. దీంతో వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయి వరకు దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తూ చర్యలు చేపట్టారు. క్లస్టర్ల వారీగా వ్యవసాయ విస్తరణ అధికారులు అన్ని గ్రామాల్లో దీనిపై విస్తృత ప్రచారం కల్పించారు.
అక్కడక్కడా సాంకేతిక సమస్యలు ఉన్న ఖాతాలతో పాటు తమకు అందుబాటులో ఉండేవిధంగా బ్యాంకుల ఖాతాలను రైతులు మార్చుకుంటున్నారు. తమ గ్రామ పరిధిలో ఉన్న బ్యాంకులకు ప్రాధాన్యతనివ్వడంతో పాటు కొందరు రైతులు తాము నివాసం ఉంటున్న ప్రాంతాలకు దగ్గరగా ఉండే బ్యాంకులను ఎంచుకుంటున్నారు. పథకం ప్రారంభం నుంచి అవే ఖాతాలు కొనసాగుతుండడంతో తాజాగా రైతులకు ఈ అవకాశం కల్పించారు. దీంతో చాలామంది రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఖాతాల మార్పునకు బుధవారం తుదిగడువుగా నిర్ణయించారని, ఇంకా ఎవరైనా రైతులు ఉంటే ఖాతాలను మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
2018 వానకాలం సీజన్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఏటా రెండు సీజన్ల చొప్పున ఇప్పటివరకు ఎనిమిది సీజన్లలో రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడిసాయం అందిస్తూ వచ్చారు. వానాకాలం, యాసంగి సీజన్లలో ఎకరానికి ఐదు వేల చొప్పున మొత్తం 10వేల రూపాయలను అందజేస్తూ వస్తున్నారు.
రైతు తన వివరాలను వ్యవసాయశాఖకు అందజేస్తే వారు ఆ వివరాలను పోర్టల్లోకి అప్లోడ్ చేయగా ఆ మేరకే పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లోకి చేరుతున్నది. ప్రస్తుత వానకాలం సీజన్లో తొమ్మిదో విడత రైతుబంధు నగదు పంపిణీకి సన్నాహకాలు మొదలయ్యాయి. వచ్చే నెలలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. ఆ లోపే నూతనంగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులకు సైతం గతంలో మాదిరిగానే అవకాశం కల్పించనున్నారు.
గత ఏడాది వానకాలం సీజన్లో జూన్ 15 నుంచి రైతుబంధుకు శ్రీకారం చుట్టారు. పది రోజుల పాటు రోజూ చిన్న రైతుల నుంచి పెద్ద రైతుల వరకు నగదు జమ చేస్తూ వచ్చారు. ఇక యాసంగిలో సైతం ముందే రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. డిసెంబర్ 28వ తేదీ మొదలు పెట్టి జవవరి 20 వరకు నిరాంటకంగా జమ చేస్తూ వచ్చారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాసంగిలో 8వ విడతగా మొత్తం 9.56 లక్షల మంది రైతులకు రూ.1203.76 కోట్లను అందజేశారు. వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే ఏకైక లక్ష్యంగా కులంమతం, ధనిక, బీద, వయసుతో నిమిత్తం లేకుండా పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉండి వివరాలు అందజేసిన ప్రతి రైతుకూ పెట్టుబడి సాయం అందజేశారు.
గత యాసంగిలోనూ ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఉన్న ప్రతి రైతుకు రైతుబంధును అమలు చేసింది. దీంతో ఒక్క 8వ విడతలోనే నల్లగొండ జిల్లాలో మొత్తం 4.93లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించి వారికి రూ. 616.21 కోట్లను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే వివరాలందించిన రైతుల మేరకు మొత్తం 4,69,696 మందికిగానూ 601.74కోట్ల రూపాయలను పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లాలో 2.70లక్షల మంది అర్హులను గుర్తించగా అందులో 2.61079 మంది రైతులు వివరాలు అందజేశారు.
వీరికి మొత్తం రూ. 314కోట్లకు గానూ రూ. 309.28 కోట్లు జమ చేశారు. యాదాద్రి జిల్లాలో 2.43లక్షల మంది అర్హులను గుర్తించగా అందులో 2,25,956 మందే తమ వివరాలను నమోదు చేసుకున్నారు. దీంతో రూ. 302 కోట్ల లక్ష్యానికిగానూ రూ. 292.74కోట్ల రూపాయలను అందించగలిగారు. కొందరు రైతులు వివిధ కారణాలతో బ్యాంకు ఖాతాల్లో సమస్యలు, ఎన్ఆర్ఐలు, ఇంకొందరు తమ వివరాలు అంద జేసేందుకు సుముఖంగా లేకపోవడంతో పెట్టుబడి సాయాన్ని పొందలేకపోయారు.
రైతుబంధు పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలో మొత్తం ఎనిమిది విడుతల్లో కలిపి మొత్తం రూ. 7,930 కోట్లు రైతులకు నగదు రూపంలో అందాయి. ఇందులో ప్రతి రూపాయి నేరుగా రైతుకే చెందడం విశేషం. గతంలో ఏ పథకంలో అయినా దళారుల ప్రమేయం లేదా వివిధ రూపాల్లో లంచాలు ఇతరత్రా కారణాలతో 10 నుంచి 20శాతం సాయం దారి మళ్లేది. కానీ ఇందులో ఎవ్వరికీ సంబంధం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకే నగదును బదిలీ చేస్తూ వస్తున్నారు.
మొత్తం 8 విడుతల్లో కలిపి నల్లగొండ జిల్లాలో రూ. 4,170 కోట్లు, సూర్యాపేట జిల్లాలో రూ. 1,833కోట్లు, యాదాద్రి జిల్లాలో రూ.1,927 కోట్లు రైతులకు చేరాయి. ఈ నగదుతో కొత్తగా ఎంతో మంది రైతులు వ్యవసాయంలోకి దిగారు. గతంలో భూములు వదిలి వెళ్లిన రైతులు సైతం తిరిగి వచ్చి పంటల సాగులో బిజీ అయ్యారు. 2014కు పూర్వం ఉమ్మడి జిల్లాలో 13లక్షల ఎకరాల్లోనే పంటలు సాగు కాగా నేడు 21లక్షల ఎకరాల పైచిలుకు సాగుభూమి పెరిగిందంటేనే వ్యవసాయంలో వచ్చిన సమూల మార్పులను అర్ధం చేసుకోవచ్చు.