నల్లగొండ, మే 24 : ‘నల్లగొండకు శనిలా దాపురించి, ఎమ్మెల్యేగా 20 ఏండ్లు ఉండి, మంత్రిగా పని చేసిన నువ్వు అప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు ఏం చేస్తావు’ అని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ప్రశ్నించారు. మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కంచర్ల మాట్లాడుతూ.. సోమవారం కోమటిరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా.. వచ్చే ఎన్నికల్లో నల్లగొండలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, నల్లగొండలో తాను చేసిన అభివృద్ధి తప్ప ఏమీ జరుగలేదని మాట్లాడడాన్ని ఎమ్మెల్యే కంచర్ల తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణానికి దీటుగా పల్లెలు సైతం అభివృద్ధి జరుగుతున్నాయని, ఇది ప్రజలే చెబుతారని అన్నారు. సీఎం దత్తతతో నల్లగొండ పట్టణాన్ని రూ.575 కోట్లతో ఎంతో అభివృద్ధి చేస్తున్నామని, ఇది పట్టణ ప్రజలు చూస్తలేరా? అని ప్రశ్నించిన ఆయన దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని కోమటిరెడ్డికి సవాల్ విసిరారు. ఐటీ మంత్రిగా ఉండి ఐటీ హబ్ను విస్మరిస్తే మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఐటీ హబ్ ప్రారంభించిన విషయం తెలియదా? అని అన్నారు. నల్లగొండలో ప్రతి రోడ్డు ఆరు వరుసలుగా, కొన్ని ప్రాంతాల్లో నాలుగు వరుసలుగా వేయడంతోపాటు ప్రభుత్వ ఆస్పత్రి ఆధునీకరణ, వెటర్నరీ, మెడికల్ కళాశాలల ఫౌండేషన్, కళాభారతి, ట్యాంక్బండ్, అర్బన్ పార్కులు, జంక్షన్లు, జిమ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలో ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
జూన్ 4న మంత్రి హరీశ్రావు మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేస్తామన్నారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నిర్లక్ష్యంతో మర్రిగూడ, పానగల్ బైపాస్ వద్ద ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయకపోవడంతో అనేక మంది చనిపోయారని, అవసరం లేని చర్లపల్లి, అనిశెట్టి దుప్పలపల్లిలో ఫ్లైఓవర్లు వేయించారన్నారు. భువనగిరి ప్రజలు గెలిపిస్తే అక్కడి ప్రజలకు న్యాయం చేయలేని నీవు, నల్లగొండ ప్రజలకు ఏం చేస్తావని ప్రశ్నించారు. నాడు పట్టణంలో యూజీడీ పేరుతో రూ.30 కోట్లు తెచ్చి జేబులు నింపుకున్నారు తప్ప, ఆ పనిని మాత్రం గాలికి వదిలేశారన్నారు. నాడు వేసవి వస్తే నీటికి కరువేనని, ఇవాళ రెండో పైప్లైన్ వేసి పట్టణ ప్రజలకు రెండ్రోజులకోసారి తాగునీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
నల్లగొండను మరో రెండేండ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. కోమటిరెడ్డిని నల్లగొండ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ఇక్కడ పోటీ చేస్తే జనం తరిమికొడుతారని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్వలీ, పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పిల్లి రామరాజు, బోనగిరి దేవేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్రెడ్డి, కనగల్, తిప్పర్తి ఎంపీపీలు కరీంపాషా, విజయలక్ష్మి, ఆలకుంట్ల నాగరత్నం రాజు, దేప వెంకట్రెడ్డి, పల్రెడ్డి రవీందర్రెడ్డి, ఐతగోని యాదయ్య, అభిమన్యు శ్రీనివాస్, ఊట్కూరి వెంకట్రెడ్డి పాల్గొన్నారు.