యాదాద్రి, మే 23 : యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి వారి ప్రధానాలయ ముఖ మండపంలోని స్పటిక రామలింగేశ్వరుడితో పాటు గర్భాలయంలోని లింగేశ్వర కుటుంబానికి అర్చకులు సోమవారం ప్రభాతవేళ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయాన్నే రామలింగేశ్వరుడికి ఆవుపాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. పరమశివున్ని విభూతితో అలంకరణ చేశారు. ఆలయంలోని సుబ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకూ అభిషేకం, అర్చన చేశారు.
శివాలయం ప్రధాన పురోహితుడి ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు. లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయంలో సోమవారం స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారికి సుప్రభాతసేవ నిర్వహించారు. తిరువారాధన, ఆరగింపు చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామివారి సువర్ణ పుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
స్వామి అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహహోమం జరిపారు. అనంతరం ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్యతిరు కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొన్నారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. యాదాద్రి కొండకింద పాతగోశాల వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. స్వామివారి ఖజానాకు రూ. 21,40,028 ఆదాయం వచ్చినట్లు ఈఓ ఎన్. గీత తెలిపారు.
ప్రధాన బుకింగ్ ద్వారా 1,60,300
వీఐపీ దర్శనాలు 1,65,000
వేద ఆశీర్వచనం 6,000
నిత్య కైంకర్యాలు 2,601
సుప్రభాతం 2,600
క్యారీబ్యాగుల విక్రయం 24,000
వ్రత పూజలు 1,07,200
కల్యాణకట్ట టిక్కెట్లు 28,600
ప్రసాద విక్రయం 11,02,100
వాహనపూజలు 8,400
అన్నదాన విరాళం 39,471
సువర్ణ పుష్పార్చన 1,78,316
యాదరుషి నిలయం 11,02,100
పాతగుట్ట నుంచి 38,620
కొండపైకి వాహన ప్రవేశం 2,00,000
లక్ష్మీ పుష్కరిణి 500
గోపూజ 1,400