కొండమల్లేపల్లి, మే 23 : నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలతో వాహనదారులు, రైతులు, పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దానికితోడు చెట్లను నరికి ఇటుక బట్టీలకు వినియోగిస్తున్నారు. చిన్నారులను బట్టీల్లో పనికి పెట్టుకుని బాలకార్మికులుగా మారుస్తున్నారు. కొండమల్లేపల్లి మండల పరిధి సాగర్ రోడ్డులో చిన్నఅడిశర్లపల్లి సమీపంలో పెండ్లిపాకల, చింతకుంట్ల గ్రామాలకు వెళ్లే రహదారుల్లో ఇటుక బట్టీలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. వేసవి కావడంతో తీవ్రమైన వడగాడ్పుకు బట్టీల నుంచి దుమ్ము, ధూళి వస్తుండడంతో ఇబ్బంది పడుతున్నామని సమీప ప్రాంతాల రైతులు, వాహనదారులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరు వ్యాపారులు ఇక్కడ ఇటుక బట్టీలు ఏర్పాటు చేసుకొని గద్వాల, ఒరిస్సా తదితర ప్రాంతాల నుంచి కూలీలను రప్పించుకొని పనులు చేయించుకుంటున్నారు. వారి పిల్లలను కూడా బట్టీల్లో పనికి పెట్టుకుని బాలకార్మికులుగా మారుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా చెట్లను నరికి బట్టీలకు వినియోగిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిబంధనలు పాటించకుండా ఏర్పాటు చేసిన ఇటుక బట్టీలను తొలగించాలని కోరుతున్నారు. ఈ విషయమై డీఎల్పీఓను వివరణ కోరగా.. ఇటుక బట్టీల నిర్వహణపై ఫిర్యాదులు వచ్చాయని, చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి సూచించినట్లు తెలిపారు.
ఇటుక బట్టీలతో వెలువడే దుమ్ము, ధూళితో అనారోగ్యానికి గురవుతున్నాం. ఈ విషయమై ఇటుక బట్టీల వ్యాపారులకు కూడా తెలియజేసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదు. ఇటీవలే డీఎల్పీఓ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన విచారణ జరిపారు. ఇప్పటికైనా బట్టీలు తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
-గడ్డం శ్రీరాములు, సర్పంచ్, చిన్న అడిశర్లపల్లి
ఇటుక, బొగ్గు బట్టీల నిర్వహణతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయంపై వినతులు అందాయి. బట్టీల నుంచి వెలువడే దుమ్ము, ధూళితో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు తెలియజేశారు. బట్టీల నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటాం.
– బాలరాజురెడ్డి, ఎంపీడీఓ, కొండమల్లేపల్లి