మునుగోడు, మే 23 : యాసంగి ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ధాన్యం కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసినా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజా తీసుకునేందుకు ముందుకు వచ్చి కేంద్రాలను ఏర్పాటు చేసింది. దాంతో కేంద్రాలకు భారీగా ధాన్యం వస్తుండడంతో ఎక్క డా అవాంతరాలు లేకుండా టీఆర్ఎస్ సర్కారు మాత్రం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కొనుగోళ్లు చేపట్టింది. మునుగోడు మండలంలో 11 కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 1,17,397 క్వింటాళ్ల ధాన్యాన్ని రైతుల నుంచి మద్దతు ధరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది.
పీఏసీఎస్ ఆధ్వర్యంలో మునుగోడు, సింగారం, కచలాపురం, గూడపూర్, ఊకొండి గ్రామాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఇప్పటి వరకు 1,221 మంది రైతుల నుంచి 66,189 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వీరిలో 544 మంది రైతుల ఖాతాల్లో రూ.6.22కోట్ల సొమ్మును జమచేశారు. ఇంకా 677 మంది రైతులకు రూ.6.74కోట్లు చెల్లించాల్సి ఉంది.
ఐకేపీ ఆధ్వర్యంలో కొరటికల్, కల్వలపల్లి, పలివెల, పులిపలుపుల, బీరెల్లిగూడెం, కొంపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేశారు. ఆయా కేంద్రాల ద్వారా 896 మంది రైతుల నుంచి 51,208 క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ఇప్పటి వరకు 456 మంది రైతుల ఖాతాల్లో రూ.5.14 కోట్లు జమచేయగా.. ఇంకా 440 మందికి రూ.4.89కోట్లు చెల్లించాల్సి ఉంది.
ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని రైతులు నష్టపోకుండా ఉండేందుకు ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం (ఓపీఎంఎస్)ను టీఆర్ఎస్ సర్కారు అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ విధానం ద్వారా నిర్ణీత ప్రమాణాల ప్రకారం ఉన్న గ్రేడ్-ఏ రకం ధాన్యానికి క్వింటాకు రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 చొప్పున కనీస మద్దతు ధరను ప్రభుత్వం రైతులకు చెల్లిస్తున్నది. ధాన్యం కొనుగోళ్లు వేగవంతగా నడిచేందుకు జిల్లా అధికారులు నిరంతరం కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. లారీలు, గన్నీ సంచులు, హమాలీల కొరత లేకుండా చూడటంతో పాటు కేంద్రాల నుంచి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.
రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం టీఆర్ ఎస్దే. రాజకీయ ప్రయోజనాల కోసం ధాన్యం కొనుగోళ్ల విషయంలో నానా రాద్ధ్దాంతం చేసిన బీజేపీ సర్కారు చివరి నిమిషంలో రైతులకు మొండిచేయి చూపింది. రైతుల కష్టాలు తెలిసిన నేతగా సీఎం కేసీఆర్ మాత్రం వెనకడుగు వేయలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్ముకున్న అన్నదాతల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు.
-ఏరుకొండ శ్రీనివాస్, డైరెక్టర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ, చండూరు