కోదాడ రూరల్/కోదాడటౌన్, మే 22 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పలు పథకాలు అమలు చేస్తున్నారని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. సోమవారం కోదాడ పట్టణ పరిధి కోమరబండలో రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుతో కలిసి గొర్రెలు పంపిణీ చేశారు. 10, 11వ వార్డుల్లో 11 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఇంటింటికీ తిరిగి అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని ఎవరూ ఊహించని విధంగా గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి చేస్తున్నారని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. రాష్ట్ర పథకాలను యువత ప్రజలకు వివరించాలని, సీఎం కేసీఆర్ను స్ఫూర్తిగా తీసుకోవాలని దూదిమెట్ల బాలరాజుయాదవ్ సూచించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శీరిష, వైస్ చైర్పర్సన్ వెంపటి పద్మ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బుర్ర సుధారాణీపుల్లారెడ్డి, వైస్ చైర్మన్ సంపెట ఉపేందర్గౌడ్, కౌన్సిలర్ మామిడి పద్మావతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రహీం, రైతు బంధు సమితి మండల కన్వీనర్ అనంత సైదయ్య, గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం మండల అధ్యక్షుడు బత్తుల కిట్టుయాదవ్, నాయకులు బుర్ర పుల్లారెడ్డి, మామిడి రామారావు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ కోమరబండలో ఉదయం 9 గంటల నుంచి కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఇంటింటికీ తిరిగి చెక్కులు అందిస్తున్నారు. 11వ వార్డులో కల్యాణలక్ష్మి లబ్ధిదారు దేవపంగు ఇందుశ్రీకి చెక్కును అందించేదుకు ఎమ్మెల్యే వెళ్లాడు. ‘అన్న ఎండలో ఇంటింటికీ తిరుగుతున్నావు, ఎప్పుడు తిన్నవో ఏమో కొంచెం ఎంగిలిపడన్నా’ అంటూ ఆమె అన్నం కలిపి ఎమ్మెల్యేకు తినిపించింది. ఎండలో ఉదయం నుంచి నిమిషం తీరిక లేకుండా తిరుగుతున్న ఎమ్మెల్యేకు చెల్లిగా ఆకలిని గుర్తించి అన్నం తినిపించడంతో పలువురు హర్షం వ్యక్తంచేశారు.