గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించి మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలోనూ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు సిద్ధమైంది. పట్టణాలకు తీసిపోని విధంగా పల్లెలను తీర్చిదిద్ది శాశ్వత వనరులను సమకూరుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆట స్థలాలపై దృష్టి కేంద్రీకరించింది. క్రీడాకారులకు ఉపయోగపడేలా, కొత్త తరాన్ని తీర్చిదిద్దేలా ప్రతి గ్రామ పంచాయతీతో పాటు ఆవాసాల్లోనూ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి వాటిల్లో కోర్టుల నిర్మాణం చేపట్టనున్నది.
అందుకోసం ప్రతిచోటా అరెకరం నుంచి ఎకరం స్థలం గుర్తించాలని రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలిచ్చింది. ఆ మేరకు ఇప్పటికే నల్లగొండ జిల్లావాప్తంగా 603, సూర్యాపేట జిల్లాలో 329చోట్ల స్థలాలను గుర్తించారు. ఎంపిక చేసిన ఆ స్థలాలను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ప్రతి మండలంలో కనీసం రెండు గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ప్రారంభించే దిశగా కసరత్తు చేస్తున్నారు. అనంతరం ఆయా గ్రామాలకు అవసరమైన స్పోర్ట్స్ కిట్లను కూడా అందించనున్నారు.
నల్లగొండ, మే 23 : క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగించడంతోపాటు దేహదారుఢ్యాన్ని పెంపొందిస్తాయి. అంతేకాకుండా క్రీడల్లో ప్రతిభ చూపితే ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్ సౌకర్యం పొందవచ్చు. ఒకప్పుడు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో క్రీడా మైదానం ఉండడంతోపాటు క్రీడా ఉపాధ్యాయుడు ఆయా క్రీడల్లో శిక్షణ ఇచ్చేవాడు. కాలానుగుణంగా ప్రైవేటు పాఠశాలలపై మోజుతో స్థలాభావంతోపాటు క్రీడలను అనవసరంగా భావిస్తున్న ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యం కారణంగా నేడు విద్యార్థులు క్రీడలకు దూరమయ్యారు.
ఈ క్రమంలో క్రీడల ప్రాధాన్యతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీతోపాటు ఆవాస గ్రామంలోనూ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని తలంచి శరవేగంగా ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతున్నది. సర్కారు ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నది.
క్రీడలను ప్రోత్సహించడంతోపాటు గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి గ్రామంలోనూ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. గ్రామ పంచాయతీలో ఎకరం నుంచి ఎకరన్నర స్థలంలో, ఆవాసాల్లో అర ఎకరం నుంచి ఎకరం స్థ్దలంలో ఈ ప్రాంగణాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల్లో స్థలాల గుర్తింపు శరవేగంగా కొనసాగుతున్నది. ప్రతి క్రీడా ప్రాంగణం చుట్టూ హరితహారం కింద మొక్కలు నాటనున్నారు. కబడ్డీ కోర్టుతోపాటు ఖోఖో, వాలీబాల్, బాస్కెట్బాల్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. వ్యాయామానికి లాంగ్ బార్ సింగిల్, డబుల్ స్తంభాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. క్రీడా ప్రాంగణానికి సంబంధించిన లేఅవుట్ను సైతం శనివారం విడుదల చేసి జిల్లా అధికార యంత్రాంగానికి పంపింది.
క్రీడా ప్రాంగణాలను నెలరోజుల్లో వినియోగంలోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జూన్ రెండో తేదీ నాటికి ప్రతి మండలంలో రెండు గ్రామ పంచాయతీల్లో అన్ని వసతులతో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి జూన్ చివరి నాటికి అన్ని గ్రామాల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ప్రాంగణాల్లో కోర్టుల ఏర్పాటు ఎన్ఆర్ ఈజీఎస్ కిందనే పూర్తి చేసి గ్రామ పంచాయతీ నిధులతో స్తంభాలు, గేట్ నిర్మాణం, ఆర్చ్, నేమ్ బోర్డు చేయించనున్నారు. బాస్కెట్బాల్, వాలీబాల్కు సంబంధించిన కిట్లతోపాటు క్రీడాకారులకు టీషర్ట్స్ను ప్రభుత్వం అందజేయనున్నది.
జిల్లా వ్యాప్తంగా 844 గ్రామ పంచాయతీలు ఉండగా వాటి పరిధిలో 631 ఆవాసాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 601 గ్రామ పంచాయతీల్లో 350.25 ఎకరాలు, 2 ఆవాసాల్లో 3.12 ఎకరాల స్థలం గుర్తించిన అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ప్రతి మండలానికి ప్రత్యేకాధికారిని నియమించగా ఆ అధికారి ఈ క్రీడా ప్రాంగణాలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. జూన్ మూడు నుంచి 18వరకు పల్లె ప్రగతి కొనసాగనున్న నేపథ్యంలో అప్పటిలోగా మెజారిటీ క్రీడా ప్రాంగణాలు పూర్తి చేయాలని పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ ఆదేశించారు.
ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయా గ్రామాలతోపాటు ఆవాసాల్లోనూ స్థలాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నది. జిల్లాలో 844 గ్రామపంచాతీలు ఉండగా, అందులో 601 గ్రామాల్లో 350 ఎకరాలు, రెండు ఆవాసాల్లో 3 ఎకరాల భూమిని గుర్తించాం. గుర్తించిన గ్రామాల్లో పనులు ప్రారంభించి జూన్ 2 నాటికి ప్రతి మండలంలోనూ రెండు పంచాయతీల్లో క్రీడా ప్రాంగణాలను ప్రారంభిస్తాం.
-దేప విష్ణువర్ధన్రెడ్డి, జిల్లా పంచాయతీరాజ్ అధికారి, నల్లగొండ
సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో 475 గ్రామ పంచాయతీలతోపాటు ఆవాసాలను కలుపుకొని 771 చోట్ల క్రీడా మైదానాల ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 329 చోట్ల అధికారులు స్థలాలను గుర్తించి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించారు.
పాలకవీడు : మండలంలోని గుడుగుంట్లపాలెం, మూసీఒడ్డుసింగారం, యల్లాపురంలో క్రీడా ప్రాంగణాల కోసం తాసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీఓ శ్రీనివాస్రెడ్డి సోమవారం స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి గ్రామీణ యువతకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కిష్టిపాటి అంజిరెడ్డి, సర్పంచులు తీగల లక్ష్మీవెంకట్రెడ్డి, బోయబోయిన వెంకటరమణాభిక్షం, ఎంపీఓ దయాకర్, సర్వేయర్ ఖాజామొహినొద్దీన్, ఏపీఓ సందీప్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాగ పద్మజ పాల్గొన్నారు.