ఎంప్లాయ్ ఫ్రెండ్లీ సర్కారుగా పేరున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిలో కీలకంగా పని చేస్తున్న సెర్ప్ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో సెర్ప్ ఉద్యోగులు, సిబ్బందికి పేస్కేల్ వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకున్నది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీకి కార్యరూపం ఇస్తూ శనివారం జీఓ 11 చేసింది. ప్రభుత్వంలోని పలు ఉద్యోగ స్థాయిలకు సమాన హోదా కల్పిస్తూ అందుకు అనుగుణంగా వేతనాలను ఫిక్స్ చేసింది. సర్కారు నిర్ణయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 321 మందికి లబ్ధి చేకూరనున్నది. ఈ నేపథ్యంలో ఆయా కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. అందరి సంక్షేమం గురించి ఆలోచించే కేసీఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం ప్రజల అదృష్టమని సెర్ప్ ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా నల్లగొండలోని డీఆర్డీఏ కార్యాలయం ఎదుట సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
– నల్లగొండ ప్రతినిధి, మార్చి 18 (నమస్తే తెలంగాణ)
నల్లగొండ ప్రతినిధి, మార్చి18 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందికి అత్యధిక జీతాలు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. ఉద్యమ సమయంలోనే పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పినట్లుగానే స్వరాష్ట్రంలో దశలవారీగా ఉద్యోగులకు సంతృప్తికరమైన వేతనాలు అందించే ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. కేవలం ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బందికి సైతం ఇతర రాష్ర్టాల కంటే ఎక్కువ వేతనాలు లభిస్తున్నాయి. రాష్ర్టాభివృద్ధిలో ఉద్యోగులు, సిబ్బంది పాత్ర కూడా కీలకమని పదేపదే ప్రస్తావించే ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు అనుగుణంగానే వారి సంక్షేమం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పేదరిక నిర్మూలన కోసం గ్రామీణ ప్రాంతాల్లో కీలకంగా పని చేస్తున్న సెర్ప్ ఉద్యోగులు, సిబ్బందికి వేతన స్థిరీకరణ ప్రకటించారు. అందుకోసం ప్రత్యేకంగా శనివారం జీఓ 11ను ప్రభుత్వం జారీ చేసింది. గతంలో చెప్పిన మాదిరిగానే వీరందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలను నిర్ధారించారు.
గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో 2000 సంవత్సరం నుంచి వీరంతా దశలవారీగా విధుల్లోకి వచ్చారు. ప్రారంభంలో వెలుగు పథకంలో, తర్వాత సెర్ప్గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఇందులో వివిధ స్థాయిల్లో ఉద్యోగులు, సిబ్బంది పని చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాస్టర్ బుక్ కీపర్(ఎంబీకే) నుంచి కమ్యూనిటీ కో ఆర్డినేటర్(సీసీ), అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్(ఏపీఎం), డీపీఎం, ప్రాజెక్టు మేనేజర్ ఇలా జిల్లా స్థాయి వరకు వివిధ స్థాయిల్లో ఉద్యోగులు ఉన్నారు. వీరికి గతంలో స్థాయిలను బట్టి నెలకు 20 వేల నుంచి 42 వేల వరకు వేతనాలు చెల్లించేవారు. తాజాగా వీరందరికీ వారి వారి స్థాయిని బట్టి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా హోదా కల్పించి పేస్కేల్ను ప్రకటించారు. తాజా పే స్కేల్ ప్రకారం వీరికి స్థాయిని బట్టి కనిష్ఠంగా రూ.19వేల నుంచి రూ.58,850 వరకు, గరిష్ఠంగా రూ.51,320 నుంచి 1,27,310 రూపాయల వరకు వేతనం వర్తించనున్నది.
ఉమ్మడి జిల్లాలో 321 మందికి లబ్ధి
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఉమ్మడి జిల్లాలో సెర్ప్లో పనిచేస్తున్న మొత్తం 321 మందికి లబ్ధి చేకూరనున్నది. నల్లగొండ జిల్లాకు చెందిన 170, సూర్యాపేట జిల్లాలో 79, యాదాద్రి భువనగిరిలో 72 మంది వివిధ హోదాల్లో పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మండల సమాఖ్య కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు(ఎంఎస్సీసీ)గా నల్లగొండలో ఏడుగురు, సూర్యాపేటలో ముగ్గురు, కమ్యూనిటీ కో ఆర్డినేటర్లు(సీసీ)లుగా నల్లగొండలో 112, సూర్యాపేటలో 39, యాదాద్రిలో 43 మంది, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు(ఏపీఎం)లుగా నల్లగొండలో 38, సూర్యాపేట 29, యాదాద్రిలో 23 మంది, డీపీఎంలుగా నల్లగొండలో నలుగురు, సూర్యాపేటలో నలుగురు, యాదాద్రిలో ఐదుగురు, ప్రాజెక్టు మేనేజర్గా నల్లగొండలో ఒకరు, ఆడ్మిన్ అసిస్టెంట్లుగా నల్లగొండలో ఎనిమిది మంది, సూర్యాపేటలో నలుగురు, యాదాద్రిలో ఒకరు పని చేస్తున్నారు. వీరికి స్థాయిలను బట్టి ప్రభుత్వ ఉద్యోగాల్లోని ఆఫీస్ సబార్డినేటర్లు మొదలు ఎంపీడీఓల స్థాయి వరకు సమాన హోదాతో పే స్కేల్ వర్తింపజేస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. దాంతో సెర్ప్లో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న ఉద్యోగ, సిబ్బందిలో సంతోషం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం తమ కృషిని గుర్తించడం జీవితంలో మర్చిపోలేని సంఘటన అని పేర్కొంటున్నారు. స్నేహపూర్వక వాతావరణంలో ఉద్యోగులు పనిచేసేలా చూస్తూ వారి సంక్షేమ కోసం చిత్తశుద్ధితో వ్యవహరించడం సీఎం కేసీఆర్కే సాధ్యమని ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రభుత్వానికి రుణపడి ఉంటాం
రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని పే స్కేల్ వర్తింపజేస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకొని ఆలస్యం చేయకుండా ఉత్తర్వులు ఇవ్వడం శుభపరిణామం. రెండు దశాబ్దాలుగా ఏ ప్రభుత్వమూ మమ్మల్ని గుర్తించకపోవడంతో ఇన్నాళ్లూ బాధపడ్డాం. సీఎం కేసీఆర్ మా సమస్యలను అర్థం చేసుకొని ఇవ్వాల పే స్కేల్ వర్తింపజేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేమంతా ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. ఇక నుంచి రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తాం.
-గుండ్లపల్లి నరహరి, ఏపీఎంల సంఘం జిల్లా అధ్యక్షుడు, నల్లగొండ