రాష్ట్రంలో తొలి రెండు స్థానాల్లో ఉమ్మడి జిల్లా
రోజుకు 98,359 మందికి పనితో మొదటి స్థానంలో నల్లగొండ
96,791 మందితో సూర్యాపేట రెండో స్థానం
రోజుకు లక్షకు మందికిపైగా ఉపాధి కల్పనే ధ్యేయం
ఉపాధి హామీ పథకం పనులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రజలకు పని కల్పించడంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలు పోటీ పడుతున్నాయి. నిత్యం 98వేలకు పైగా మందికి ఉపాధి కల్పిస్తూ నల్లగొండ జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. 96,791 మందితో సూర్యాపేట జిల్లా రెండో స్థానంలో ఉంది. జాబ్కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించి, రోజుకు లక్ష మందికి పైగా పని కల్పించాలన్న ధ్యేయంతో ముందుకు సాగుతున్నట్లు రెండు జిల్లాల అధికారులు చెప్తున్నారు.
సూర్యాపేట, మే 15 : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి లభిస్తున్నది. ఈ పథకం ద్వారా అడిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పిస్తూ వారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతిరోజు 2.31 లక్షల మంది ఉపాధి కూలీకి వెళ్తున్నారు. ఈ పథకం అమలులో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలు రాష్ట్రంలోనే మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. నల్లగొండ జిల్లాలోని 844 గ్రామ పంచాయతీల పరిధిలో 3,82,285 కుటుంబాలకు జాబ్కార్డులు ఉండగా 8,86,328 మంది కూలీలు ఉన్నారు. ఇందులో 4.60 లక్షల మంది కూలీలు యాక్టివ్గా ఉన్నారు. ప్రతి రోజు జిల్లా వ్యాప్తంగా 98 వేలకు పైగా కూలీలకు పని కల్పిస్తూ రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. రోజుకు లక్ష మందికి పైగా ఉపాధి కల్పించాలనే లక్ష్యంగా అధికారులు పనులను ముమ్మరం చేస్తున్నారు.
సూర్యాపేటకు రెండో స్థానం
సూర్యాపేట జిల్లాలో 475 గ్రామ పంచాయతీల పరిధిలో 2,69,557 కుటుంబాలకు జాబ్కార్డులు ఉండగా.. సుమారు 6,26,392 మంది కూలీలు ఉన్నారు. వీరిలో 3,54,207 ఉపాధి పనులకు వస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 96 వేలకు పైగా కూలీలకు ఉపాధి కల్పిస్తూ సూర్యాపేట జిల్లా రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సూర్యాపేట జిల్లాలోని 23 మండలాల పరిధిలోని 475 గ్రామ పంచాయతీలలో సుమారు 79 లక్షల పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వేసవి పూర్తయి వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే నాటికి 50 శాతం పనులు పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
యాదాద్రి జిల్లాలో..
యాదాద్రి భువనగిరి జిల్లాలో 421 గ్రామ పంచాయతీలు ఉండగా 1,64,461 కుటుంబాలకు జాబ్ కార్డులు ఉన్నాయి. 3,47,960 మంది కూలీలు ఉండగా 1.50 లక్షల మంది యాక్టివ్గా పనిచేస్తున్నారు. ప్రతి రోజు 36 వేలకు పైగా కూలీలకు పని కల్పిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 2.31 లక్షల మందికి రోజూ ఉపాధిహామీ పథకం ద్వారా పని కల్పిస్తున్నారు. ఈ ఏడాది ఉపాధి కూలీలకు గరిష్టంగా రూ.257 వేతనం ఇస్తున్నారు. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే వరకు గ్రామాల్లో ఉపాధి పనులు జోరుగా సాగుతుం టాయి. గ్రామాల్లోని చెరువుల్లో పూడిక తీత పనులు, చెరువు కట్టలపై కంపచెట్ల తొలగింపు, వ్యవసాయ భూముల్లో మట్టి ఎత్తటం, ఫీడర్ చానల్ వంటి పనులు చేయిస్తున్నారు. గ్రామాల్లో ప్రాధాన్యత క్రమంలో మొత్తం 21 రకాల పనులు చేపడుతున్నారు.
రోజుకు లక్ష మందికి పనులు కల్పించడమే లక్ష్యం
ఉపాధిహామీ పథకంలో భాగంగా రోజుకు లక్ష మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనులను ముమ్మరం చేస్తున్నాం. ప్రస్తుతం ఉపాధి కూలీలకు రోజు గరిష్టంగా రూ.257 వరకు వేతనం చెల్లిస్తున్నాం. మంచి కూలి రావడంతో కూలీలు పెద్ద ఎత్తున పనులకు వస్తున్నారు. ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో 96 వేలకు పైగా కూలీలు ఉపాధి పనులకు వస్తున్నారు. వ్యవసాయ పనులు ప్రారంభం నాటికి టార్గెట్లో 50 శాతం పనులు పూర్తి చేస్తాం. ఉపాధి కల్పించడంలో సూర్యాపేటను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం.
– సుందరి కిరణ్కుమార్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, సూర్యాపేట