నార్కట్పల్లి, జూన్ 27 : వాన కాలంలో కురిసే ప్రతి నీటిబొట్టునూ ఒడిసి పడితే భూగర్భ జలాల వృద్ధికి సంకల్పించింది. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జలశక్తి అభియాన్ ద్వారా వివిధ పనులు చేపట్టాయి. ఈ పథకానికి ఉపాధి హామీ పథకం అనుసంధానించడం ద్వారా గ్రామాల్లో కూలీలతో పనులు కొనసాగుతున్నాయి. ఇంటిపై కప్పు నుంచి వచ్చే వర్షపు నీటిని కాపాడడం చెక్డ్యామ్ నిర్మాణం, చెరువుల్లో పూడికతీత బోరుబావుల పునరుద్ధరణ, కందకాలు తవ్వడం వంటి పనులు నిర్వహిస్తున్నారు.
29 పంచాయతీలు..4,681 మంది కూలీలు
నార్కట్పల్లి మండలంలోని 29 గ్రామ పంచాయతీల్లో 4,681 మంది ఉపాధి హామీ కూలీలు పనుల్లో పాల్గొంటున్నారు. అన్ని గ్రామాల్లో భూగర్భ జలాల వృద్ధే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు కొన్ని గ్రామాల్లో పనులు పూర్తికాగా, మిగితావి ప్రగతి దశలో ఉన్నాయి. ఇంకా ఇంకుడు గుంతల నిర్మాణ పనులకు కూడా ప్రా ధాన్యం ఇవ్వనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు నివాసాల సముదాయాలు నీరు వృథా అవుతున్న ప్రాంతాల్లో ఈ ఇంకుడు గుంతలను నిర్మించనున్నారు. ఇందుకు అవసరమైన చర్యలను అధికారులు తీసుకుంటున్నారు
అవగాహన కల్పిస్తున్నాం..
జలసంరక్షణ కోసం జలశక్తి అభి యాన్ ప్రచార వాహ నాన్ని ప్రతి గ్రామంలో తిప్పుతూ రైతులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ఉపాధి హామీ ద్వారా నీటి సంరక్షణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షాలు కురిసే లోపు చెరువుల్లో పూడికతీత, కందకాలు తవ్వడం పూర్తి చేస్తాం. నీటి సంరక్షణపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తాం.