నల్లగొండ ప్రతినిధి, జూన్25(నమస్తే తెలంగాణ) : సాగుబాటలో రైతు చతికిలా పడకుండా ఇప్పటికే అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేసింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు నిరంతర ఉచిత విద్యుత్, చెరువుల పునరుద్ధరణతో రైతులకు సాగుపై ఆసక్తి పెరిగేలా చేసింది. దీంతో పాటు రైతుకు వెన్నుదన్నుగా నిలిచేందుకు రైతుబంధు, రైతుబీమా కూడా అమలు చేస్తున్నది. పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ. 5వేల చొప్పున ఇస్తుండడంతో రైతుకు భరోసా కలుగుతున్నది. ఇప్పటి వరకు ఆరు సార్లు రైతుబంధు డబ్బులు అందగా.. ఈ వానకాలంతో ఏడోసారి కూడా రైతుల ఖాతాల్లోకి చేరాయి. ఈ నెల 15 నుంచి రైతుబంధు డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేస్తున్నది. శుక్రవారం నాటికి 4,52,158 మంది రైతుల ఖాతాల్లో రూ. 596.21 కోట్లు జమ అయ్యాయి.
రైతులకు ఆర్థిక భరోసా
సమైక్య రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యంతో వెన్నువిరిగిన రైతాంగాన్ని స్వరాష్ట్రంలో తిరిగి నిలబెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది. రైతుకు భరోసా కల్పించేందుకు అమలు చేస్తున్న రైతుబంధు పథకం డబ్బులు మరోసారి రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. గతేడాది యాసంగి నుంచి కరోనాతో అన్ని వ్యవస్థలు ఆర్థికంగా చిన్నాభిన్నమైనా.. వ్యవసాయాన్ని నిలబెట్టాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ కృషి చేశారు. అందులోభాగంగా గతేడాది యాసంగి నుంచి ఈ సంవత్సరం రెండు సీజన్లకూ రైతుబంధు డబ్బులు అందించడంతో పాటు రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేశారు. దీంతో పాటు ఈ వానకాలం సాగు ప్రోత్సాహంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది.
సీఏం కేసీఆర్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి పట్టాదారు పాసుపుస్తకం ఉన్న ప్రతి రైతుకూ రైతుబంధు సాయం అందజేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ నెల ప్రారంభం నుంచే కసరత్తు మొదలుపెట్టిన అధికారులు 15 నుంచి రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమా చేయడం ప్రారంభించారు. తొలి రోజు ఒక్క ఎకరం లోపు రైతులకు, తర్వాత రెండు ఎకరాల లోపు ఇలా దశల వారీగా పెట్టుబడి సాయం విడుదల చేశారు. ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా రైతుఖాతాకే నగదు జమ చేశారు. కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఉన్నా సరే…. పట్టాదారు పాసుపుస్తకం ఉన్న ప్రతిరైతుకూ నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. కొత్తగా పాసుపుస్తకాలు పొందిన వారికి కూడా అవకాశం కల్పించారు. ఈ నెల 10ని కటాఫ్ తేదీగా నిర్ణయిస్తూ తాజాగా భూ మార్పిడి చేసుకున్న రైతులను సైతం అర్హులుగా ప్రకటిస్తూ సాయం అందజేశారు. ఓ వైపు ధాన్యం కొనుగోలు డబ్బులు, మరోవైపు పెట్టుబడి సాయం డబ్బులతో రైతులు వానకాలం సాగులో ఉత్సాహంగా కదులుతున్నారు. ఈ వానకాలంలో గతంలో ఎన్నడూ లేనంత మందికి రైతుబంధును అందించారు.
రికార్డు స్థాయిలో..
నల్లగొండ జిల్లాలో ఈ సీజన్లో గతంలో ఏ సీజన్లోనూ లేనంత రైతుబంధు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమైంది. ఇది రికార్డు స్థాయి పెట్టుబడి సాయంగా వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ సీజన్లో మొత్తం 4,76,727 మంది రైతులను అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. వీరికి గానూ రూ. 613.20కోట్లు పెట్టుబడి సాయంగా అందించాల్సి ఉంటుందని లెక్కలు తీసింది. ఇందులో 4,54,569 మంది రైతులు తమ వివరాలను వ్యవసాయ అధికారుల వద్ద అప్డేట్ చేయించుకున్నారు. మిగతా వారు వివిధ కారణాల చేత ముందుకు రానట్లు తెలిసింది. ఇందులో శుక్రవారం నాటికి 4,53,475 మంది రైతులకు సంబంధించిన రూ.597.70లక్షల నగదును ట్రెజరీకి పంపించారు. ట్రెజరీ నుంచి శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల వరకు 4,52,158 మంది రైతుల ఖాతాల్లో రూ. 596.21కోట్ల నగదు జమా అయినట్లు జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీధర్రెడ్డి వెల్లడించారు. మిగిలిన వారికి కూడా రెండు రోజుల్లో జమ అవుతాయని వెల్లడించారు. పట్టాదారు పాసుపుస్తకాన్ని తమకు అందించిన ప్రతి రైతుకూ పెట్టుబడి సాయం అందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రైతులంతా ఈ సాయాన్ని ఉపయోగించుకుని సాగులో సత్ఫలితాలు సాధించాలని సూచించారు. గతంలో ఎన్నడూ రైతులకు ఇలా నేరుగా ఆర్థికంగా అండనిచ్చిన సందర్భాలు లేవన్నారు.
ఏడు సీజన్లలో రూ.3,405 కోట్లకు పైగా..
రైతుబంధు పథకం ప్రారంభ నుంచి నల్లగొండ జిల్లాలోని రైతులకు 3,405 కోట్ల రూపాయలకు పైగా లబ్ధి చేకూరింది. 2018 నుంచి ప్రతి సీజన్లో ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమచేస్తూ వస్తున్నది. నల్లగొండ జిల్లాలో 2018 వానకాలం సీజన్ నుంచి ఎకరానికి రూ. 4 వేల చొప్పున 3.82 లక్షల మంది రైతులకు 421 కోట్ల రూపాయలను చెక్కుల రూపంలో నేరుగా అందజేసింది. అదే ఏడాది వేసవి సీజన్లోనూ 3.65 లక్షల మంది రైతులకు రూ. 425 కోట్లను బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసింది. 2019 వానకాలం సీజన్ నుంచి ఎకరానికి 5 వేల చొప్పున మొత్తం 3,74,014 మంది రైతులకు 476 కోట్ల రూపాయలను రైతుబంధు కింద వారి ఖాతాల్లో జమచేసింది. యాసంగి పంటకు సంబంధించి 2,93,432 మంది రైతులకు రూ.304 కోట్ల నగదును అందించింది. 2020 వానకాలంలో 4.29లక్షల మంది రైతులకు రూ. 589కోట్ల నగదు, యాసంగిలో 4.40లక్షల మంది రైతులకు రూ.594 కోట్లు అందించింది. తాజాగా ఏడోసారి వానకాలంలో రికార్డు స్థాయిలో రూ. 596.21కోట్ల నగదును 4.52లక్షల మంది రైతుల ఖాతాల్లో జమచేసిన రాష్ట్ర ప్రభుత్వం తనకు వ్యవసాయం, రైతాంగం పట్ల ఉన్న చిత్తశుద్ధిని చాటుకుంది.