మిర్యాలగూడ రూరల్, మే23 : కరోనాపై పోరును పల్లెల్లో ఉధృతం చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ సిబ్బంది నిత్యం పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. బ్లీచింగ్ చల్లడం, సోడియం హైపోక్లోరైట్ పిచికారీ వంటివి చేస్తున్నారు. 46 గ్రామ పంచాయతీల్లోని 200 మంది కార్మికులు మూడు షిఫ్టులుగా పని చేస్తున్నారు. సర్పంచులు, కార్యదర్శుల పర్యవేక్షణలో పారిశుధ్యం మెరుగు పర్చడంతో పాటు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రెండో విడుత ఇంటింటి జ్వర సర్వేలో భాగంగా ఆరోగ్య సిబ్బంది జ్వర పీడితులను గుర్తించి హెల్త్ కిట్ను అందిస్తున్నారు.
ఐసొలేషన్ సెంటర్లుగా పాఠశాలలు
కరోనా పాజిటివ్ వచ్చి, ఇంట్లో ప్రత్యేకంగా ఉండే అవకాశం లేని వారి కోసం మండలంలోని 9 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో, తుంగపహాడ్ మోడల్ స్కూల్లో ఐసొలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో ఉన్న వారికి ఆరోగ్య సిబ్బంది ఉచితంగా మందులు అందించడంతో పాటు వారి ఆరోగ్యంపై నిత్యం ఆరా తీస్తున్నారు. సర్పంచులు, స్వచ్ఛంద సంస్థల వారు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు.
సోడియం హైపోక్లోరైట్ పిచికారీ
గుర్రంపోడు : మండల కేద్రంలోని అన్ని వీధుల్లో ఆదివారం సర్పంచ్ షేక్ మస్రత్ సయ్యద్మియా ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బంది సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చిన వారు ఇండ్లల్లోనే ఉండాలని, ఆరోగ్య సిబ్బంది ఇచ్చిన మందులు వాడాలని సూచించారు. ప్రజలు బయటకు వెళ్లే సందర్భాల్లో తప్పక మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు.