గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వన నర్సరీలకు చలువ పందిర్లు ఏర్పాటు
మండలంలో 17 వన నర్సరీలు
మంచి ఫలితం ఇస్తున్న చర్యలు
అర్వపల్లి, మే 18 : హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం గ్రామానికో వన నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నది. వేసవిలో ఎండ తీవ్రతకు నర్సరీల్లో మొక్కలు ఎండి పోతున్నాయి. దీంతో మొక్కలు ఏపుగా పెరిగేందుకు గ్రామ పంచాయతీల ఆధ్వ ర్యంలో సంరక్షణ చర్యలు చేపట్టారు. ఇందుకు కోసం నర్సరీ ప్రదేశమంతా గ్రీన్షెడ్ ద్వారా చలువ పందిర్లు వేశారు. ఎండ తీవ్రత పూర్తిగా తగ్గిపోయి మొక్కలకు కావాల్సినంత సూర్యరశ్మి తగిలి మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. ఈ చలువ పందిరి(గ్రీన్షేడ్) ఏర్పాటు కోసం గ్రామ పంచాయతీ నిధులు రూ.10 వేల వరకు ఖర్చు చేస్తున్నారు.
17 నర్సరీల్లో 3.20 లక్షలమొక్కల పెంపకం
మండలంలోని 17 గ్రామపంచాయతీలుండగా అన్ని పంచాయతీల్లో వన నర్సరీలను ఏర్పాటు చేశారు. ఆయా నర్సరీల్లో గ్రామాల్లో అవసరాలకు అనుగుణంగా మొత్తం 3.20 లక్షల మొక్కలను సిద్ధం చేస్తున్నారు. అత్యధికంగా మండలంలోని కుంచమర్తి, తిమ్మాపురంలో 40 వేలు, కోడూరు, అర్వపల్లి గ్రామాల నర్సరీల్లో 30 వేల మొక్కలను పెంచుతున్నారు. మిగిలిన నర్సరీల్లో 10 నుంచి 15వేల మొక్కల చొప్పున ఉన్నాయి. ఈ నర్సరీలను గతంలో ఉపాధిహామీ పథకం ద్వారా నిర్వహణ చేపట్టేవారు. దీంతో మొక్కల పెంపకం సరిగా లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం నీరుగారి పోయేది. ఈ యేడాది అలా కాకుండా గ్రామపంచాయతీలకు ప్రతినెలా విడుదల చేస్తున్న అభివృద్ధి నిధుల నుంచి నిర్వహణ ఖర్చులను కేటాయించడం వల్ల మొక్కల సంరక్షణ పక్కాగా చేపడుతున్నారు.
గ్రీన్షేడ్లో మొక్కలు బాగా పెరుగుతున్నాయి
మా గ్రామంలో రూ. 10 వేల ఖర్చుతో నర్సరీకి చలువ పందిరి ఏర్పాటు చేయడంతో నర్సరీలో మొక్కలన్నీ ఎండిపోకుండా బాగా పెరుగుతున్నాయి. నర్సరీలో పెంచిన మొక్కలన్నింటినీ ఏడో విడుత హరితహారంలో గ్రామంలోనే నాటి హరిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం.
-పాలెల్లి సురేశ్, సర్పంచ్, తిమ్మాపురం
మండలానికి సరిపడా మొక్కలు పెంచుతున్నాం
మండలపరిధిలోని 17 వననర్సరీలకు చలువ పందిర్లు ఏర్పాటు చేశారు. ఏడో విడుత హరితహారంలో మండలానికి అవసరమ య్యే నాటే మొక్కలన్నీ ఈ వన నర్సరీల్లోనే పెంచుతున్నాము. గ్రామానికి సరిపడే విధంగా ఆగ్రామంలోని నర్సరీలో మొక్కలను పెంచుతున్నాము. పెంచుతున్న మొక్కల సంరక్షణ చర్యలు కూడా బాగున్నాయి.
-శైలజ, ఏపీఓ, అర్వపల్లి మండలం