చిట్యాల, జూలై 7 : జాతీయ రహదారి వెంట అసంపూర్తిగా ఉన్న సర్వీసు రోడ్ల పనులను పది రోజుల్లోప్రారంభించకపోతే పంతంగి, కొర్లపహాడ్ టోల్గేట్లను దిగ్బంధిస్తామని, అవసరమైతే తానే స్వయంగా టోల్ గేట్ల వద్ద ధర్నాలో పాల్గొంటానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. గురువారం చిట్యాలలో ‘నమస్తే తెలంగాణ’తో ఆయన మాట్లాడారు. జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాలు, పట్టణాల్లో వీధి దీపాల నిర్వహణను కూడా పట్టించుకోవడం లేదని, చెత్తను తీసివేయడం లేదని రెండేండ్లుగా ఎన్హెచ్ఏఐ, జీఎంఆర్ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని మండిపడ్డారు. టోల్ ఫీజు వసూలు చేయడంలో చూపిస్తున్న శ్రద్ధ ప్రజలకు సర్వీసు అందించడంలో లేదని పేర్కొన్నారు. జాతీయ రహదారి వెంట నార్కట్పల్లి, నకిరేకల్ ఫ్లైఓవర్ల వద్ద పనులను అలాగే వదిలివేశారని, చిట్యాల, గుండ్రాంపల్లి, వెలిమినేడు, కేతేపల్లిలోనూ సర్వీస్ రోడ్ల నిర్వహణను గాలికి వదిలేశారని తెలిపారు. చిట్యాల పోలీస్స్టేషన్ చౌరస్తాలో ఎన్నో ప్రమాదాలు జరిగినప్పటికీ రాత్రి వేళ్లలో హైమాస్ట్ లైట్లు వేయడం లేదన్నారు. సర్వీస్ రోడ్లను కూడా మున్సిపల్ సిబ్బందే శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి ఉన్నారు.
నకిరేకల్లో మొక్కల పంపిణీ
పట్టణ ప్రగతిలో భాగంగా గురువారం నకిరేకల్ పట్టణంలోని 11వ వార్డులో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులకు మొక్కలు పంపిణీ చేశారు. పచ్చదనం, పరిశుభ్రత లక్ష్యంగా ప్రారంభించిన పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. నకిరేకల్ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలాజీ, మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ నడికుడి ఉమారాణీవెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సైన్స్ గ్రూపు మంజూరు చేసిన ఎమ్మెల్యే చిరుమర్తిని కళాశాల అధ్యాపక బృందం గురువారం క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపింది. శాలువాలతో సన్మాంచింది.