కనగల్, జూన్ 4 : ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించి కరోనా మహమ్మారిని తరిమికొడదామని దోరెపల్లి ఉప సర్పంచ్ దాసరి వెంకన్న పిలుపునిచ్చారు. శుక్రవారం గ్రామంలో కరోనా పేషెంట్ల ఇండ్లకు ఆయన వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని మనోధైర్యం కల్పించారు. హోం క్వారంటైన్లో ఉండి మందులు సక్రమంగా వాడాలన్నారు. ఇండ్ల వద్ద బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చిట్టయ్య, ఏఎన్ఎం భారతి, ఆశ కార్యకర్త ఎండీ ఆసీఫ్ప్రసన్న, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
గుడివాడలో పారిశుధ్య పనులు..
కేతేపల్లి : మండలంలోని గుడివాడ గ్రామంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా వీధుల వెంట మురుగు నీరు నిల్వకుండా పారిశుధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. శుక్రవారం మురుగు కాల్వల్లో రసాయన మందులను పిచికారీ చేశారు. కార్యక్రమాలను సర్పంచ్ కట్టా శ్రవణ్ పర్యవేక్షించారు.
యరుగండ్లపల్లిలో హెల్త్ క్యాంప్
మర్రిగూడ : మండలంలోని యరుగండ్లపల్లిలో కరోనా టెస్టులు చేసేందుకు శుక్రవారం హెల్త్ క్యాంపు నిర్వహించినట్లు మండల వైద్యాధికారి రాజేశ్ తెలిపారు. గ్రామంలోని 113 మందికి పరీక్షలు చేయగా 8మందికి పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. వారికి ఐసొలేషన్ కిట్లను అందజేశామన్నారు. సర్పంచ్ మాడెం శాంతమ్మ, డాక్టర్ శంకర్నాయక్, సూపర్వైజర్లు విజయప్రసాద్, వెంకటేశ్, ల్యాబ్ టెక్నీషియన్ నరేశ్, ఏఎన్ఎం ఫహీనా, ఆశ కార్యకర్తలు ధనమ్మ, యాదమ్మ పాల్గొన్నారు.
ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ..
నల్లగొండ రూరల్ : చర్లపల్లికి చెందిన నాగెల్లి మధు తన సోదరుడు సాయి పుట్టినరోజు సందర్భంగా పోలీస్ సిబ్బందికి చర్లపల్లిలో మాస్కులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. టూ టౌన్ సీఐ చంద్రశేఖర్రెడ్డి, రూరల్ ఎస్ఐ రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ యువత సామాజిక సేవను అలవర్చుకోవడం సంతోషకరమన్నారు. పిన్నపురెడ్డి సత్తిరెడ్డి, పగుడోజు సాయి, ఇమ్మడి విజయ్, వనం అంజి, మేడిపల్లి సైదులు, శంకర్, అశోక్, నాగార్జునచారి, వెంకన్న, రాపోలు విజయ్ పాల్గొన్నారు.
పేషెంట్లకు సరుకులు పంపిణీ
చిట్యాల : మండలంలోని గుండ్రాంపల్లికి చెందిన ఎన్ఆర్ఐ నక్కెర్తి రామాచారి సహకారంతో గ్రామంలో 30మంది కరోనా పేషెంట్లకు నిత్యావసర సరుకులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న 50 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించారు. రామాచారి తల్లిదండ్రులు సత్యమ్మలక్ష్మీనారాయణ జ్ఞాపకార్థం అతని అన్న తెలంగాణ వికాస సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసాచారి అందించారు. కార్యక్రమంలో లెక్చరర్స్ జేఏసీ నాయకుడు సోమిరెడ్డి, రాచకొండ కృష్ణయ్య, శ్రీనివాస్, రవికాంత్, శ్రీనివాసాచారి, నారాయణచారి పాల్గొన్నారు.
నేడు వ్యాక్సినేషన్..
సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించిన వ్యాపారులు, సిబ్బందికి శనివారం చిట్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ వేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామదుర్గారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
సైదులు కుటుంబానికి పరామర్శ..
మునుగోడు(చండూరు) : చండూరు మండలంలోని కొండాపురంలో కరోనాతో మృతిచెందిన జర్నలిస్టు కురిమిల్ల సైదులు కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని టీ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె రవికుమార్ అన్నారు. శుక్రవారం సైదులు కుటుంబాన్ని ఆయన పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట ఎంపీపీ పల్లె కళ్యాణి, టీజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పోగుల ప్రకాశ్, బరిగల శ్రీనివాస్, పోలగోని శ్రీధర్, శ్రీను, గిరి, శ్రీశైలం ఉన్నారు.