2013 అక్టోబర్లో..
పైలిన్ తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. వరద పోటెత్తడంతో ఎగువనున్న గొలుసుకట్టు చెరువులు నిండిపోయి నిడమనూరులోని నల్లచౌట చెరువుకు ప్రవాహం పెరిగింది. నీటి ఉధృతి కారణంగా గండి పడి కట్టలు తెగిపోయాయి. అప్పటి పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం శాఖల మంత్రిగా పనిచేసిన మంత్రి జానారెడ్డి గండి ప్రదేశాన్ని సందర్శించి వెళ్లిపోయారే తప్ప.. మరమ్మతులకు నిధులు మంజూరు చేయలేదు. దీంతో తాగునీటి కోసం మండలకేంద్రం ప్రజలు నరకయాతన పడ్డారు. చెరువు ఖాళీ కావడంతో భూగర్భ జల వనరులు సైతం అడుగంటి పోయి సాగునీరందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
2015ఫిబ్రవరిలో..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నల్లచౌట చెరువు దశ తిరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ‘మిషన్ కాకతీయ’ పథకాన్ని తీసుకురావడంతో చెరువు పునరుద్ధరణ పనులకు పునాది పడింది. రూ.2.75 కోట్లు మంజూరు చేసి గండి పూడ్చి కట్టలను పటిష్టం చేశారు. చెరువు పూడిక తీయించి అలుగు పునర్నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయడంతో నాటి నుంచి జలకళ ఉట్టిపడుతున్నది.
మిషన్ కాకతీయ పథకం మండల కేంద్రంలోని నిడమనూరు నల్లచౌట చెరువు గోస తీర్చింది. సాగు, తాగు నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఉద్దేశించిన మిషన్ కాకతీయ పథకం పుణ్యమా అని నల్లచౌట చెరువు పూర్వ వైభవం సంతరించుకున్నది. నిరీక్షణకు తెరదించుతూ జరిగిన పనులు చెరువుకు కొత్త అందాలు తీసుకొచ్చాయి.నల్లచౌట చెరువు పరిధిలో స్థిరీకరించిన 700ఎకరాల ఆయకట్టుకు తెలంగాణ ప్రభుత్వం జీవం పోసింది. చెరువు నిర్మాణ సమయంలో 110మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం ఉండగా దశాబ్దాల పాటు పేరుకుపోయిన పూడిక కారణంగా నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. మిషన్ కాకతీయ పథకంలో పెద్ద ఎత్తున పూడిక తీయడంతో సామర్థ్యం పెరిగి నిర్ణీత సాగు కంటే అధికంగా మరో 50ఎకరాల వరకు సాగవుతున్నట్లు అంచనా. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం కారణంగా చెరువు ఆయకట్టు సస్యశ్యామలమైంది. ప్రభుత్వ బృహత్తర సంకల్పం ఫలితంగా వానకాలం, యాసంగి సీజన్లలో పంటలు పండుతున్నాయి.
ఆయకట్టు సస్యశ్యామలం…
2013లో పైలిన్ తుఫాన్ కారణంగా నల్లచౌట చెరువుకు గండిపడి నాలుగేండ్ల పాటు ఎండిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం కింద నిధులు మంజూరు చేయడంతో పునరుద్ధరణ జరిగింది. యుద్ధప్రాతిపదికన కట్టలు, అలుగు పనులు పూర్తి చేయడంతో రైతుల కష్టాలు తొలగిపోయాయి. ఏటా రెండు పంటలకు నీరు విడుదలవుతున్నది.