– ఎస్ఐ దంపతులతో పాటు మరో ఇద్దరికి తీవ్రగాయాలు
కట్టంగూర్, నవంబర్ 17 : నకిరేకల్ ఎక్సైజ్ ఎస్ఐ కారు టైరు పేలి బోల్తా పడడంతో భార్యాభర్తలతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం కట్టంగూర్ గ్రామ శివారులోని శ్రీకృష్ణనగర్ వద్ద 65వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుండి నకిరేకల్ వైపు వెళ్తున్న ఎక్సైజ్ ఎస్ఐ కారు శ్రీకృష్ణనగర్ వద్దకు రాగానే టైరు పేలింది. దీంతో కారు అదుపు తప్పి ముందున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి రోడ్డు పక్కన నీటి గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఎక్సైజ్ ఎస్ఐ భానుప్రకాశ్, అతని భార్య ప్రియాంకతో పాటు బైక్పై వెళ్తున్న నకిరేకల్ మండలం చందంపల్లి గ్రామానికి చెందిన భార్యాభర్తలు పాలడుగు అంజయ్య, రేణుకకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, ఇతర వాహనదారులు క్షతగాత్రులను 108 వాహనంలో నకిరేకల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఎక్సైజ్ ఎస్ఐ కూతురుకు స్వల్ప గాయాలయ్యాయి.