నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కట్టంగూర్, జూన్ 22 : రైతుల్లో చైతన్యానికి రైతు వేదికలు దోహదపడుతాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం మండలంలోని పామనుగుండ్లలో రూ.22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం దుగినవెల్లి, ఈదులూరు, పామనుగుండ్ల గ్రామాల్లో రూ.2 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం చూపిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తరువాత రైతులకు ఎకరానికి రూ.10వేల పెట్టుబడి సాయంతోపాటు సాగునీటి వసతి, 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా ప్రవేశపెట్టి రైతులను రాజుల్లా చూసుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. అనంతరం పాఠశాలల్లో మొక్కలు నాటి ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ తరాల బలరాములు, నకిరేకల్ ఏడీఏ శ్రీధర్రెడ్డి, తాసీల్దార్ దేశ్యానాయక్, ఎంపీడీఓ పోరెళ్ల సునీత, నకిరేకల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పోగుల నర్సింహ, సర్పంచులు వడ్డె సైదిరెడ్డి, వనం సైదమ్మాదుర్గయ్య, ఐతగోని నారాయణ, పనస సైదులు, పరశురాములు, సిరిగిరెడ్డి వినోద, ఎంపీటీసీలు పాలడుగు హరికృష్ణ, ఎడ్ల పురుషోత్తంరెడ్డి, మల్లెబోయిన శ్రీలతాకృష్ణ, తవిడబోయిన భవాని, ఏఓ శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఏడుకొండల్ పాల్గొన్నారు.