మాడ్గులపల్లి, అక్టోబర్ 30 : నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం పాటుపడుతున్నానని.. రాబోయే ఎన్నికల్లో తనను మరో మారు ఆశీర్వదించి అభివృద్ధిని కొనసాగించాలని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కోరారు. సోమవారం మండలంలోని అభంగాపురం, పూసలపాడు, గజలాపురం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. 50 ఏండ్ల పాటు రాష్ర్టాన్ని, దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కనీసం గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేక పోయిందన్నారు.
కుందూరు జానారెడ్డి గతంలో అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేసినప్పటికీ నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత నాగార్జునసాగర్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందిన తర్వాతే నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందన్నారు. ఎన్నికల సందర్భంగా కల్లబొల్లి మాటలతో కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు యత్నిస్తుందని, ప్రజలు వారి మాయలో పడొద్దన్నారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే నోముల భగత్ను నియోజకవర్గ ప్రజలు మరో మారు ఆశీర్వదించి అధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్సీ ఎంసీ. కోటిరెడ్డి అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యానికి నియోజకవర్గం ఎడారిగా మారిందని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్తో పాటు ఎమ్మెల్యే భగత్ కృషితో తిరిగి అభివృద్ధి పథంలో పయనిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఇంటికీ చేరాయన్నారు. పుట్టిన బిడ్డ నుంచి మొదలు ముసలి వారి వరకు అన్ని వర్గాల ప్రజల కోసం సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ పథకాలే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తాయని దీమా వ్యక్తం చేశారు.
అంతకు ముందు అభంగాపురంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే భగత్ గులాబీ కండువాలు కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాలుట్ల బాబయ్య, జిల్లా కోఆప్షన్ సభ్యుడు మోసిన్అలీ, నాయకులు నరేందర్ పాల్గొన్నారు.
త్రిపురారం : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. సోమవారం మండలంలోని పెద్దదేవులపల్లి, బాబుసాయిపేట, దుగ్గేపల్లి, కామారెడ్డిగూడెం, కంబాలపల్లి, కొణతాలపల్లి గ్రామాల్లో ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాతే నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు.
రైతుబంధు, రైతుబీమా పథకాలతో పాటు వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్, ఎరువులు, విత్తనాలు, పండిన ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు వంటి వాటితో రైతును రాజుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు. సమైక్య పాలనలో త్రిపురారం మండలం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేదని, తెలంగాణ ఏర్పాటయ్యాక దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య రూ.5.70 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏనాడూ నియోజకవర్గ ప్రజల బాధలు పట్టించుకోని జానారెడ్డి తన కుమారుడు ఎమ్మెల్యే అని తాను ముఖ్యమంత్రిగా అవుతామంటూ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రస్తుతం బాబుసాయిపేట గ్రామం వద్ద బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందన్నారు.
పెద్దదేవులపల్లి గ్రామంలోని కంపెనీలో ఉన్న వారి పింఛన్లు తొలగించగా 730 మందికి ప్రత్యేకంగా పింఛన్లు ఇప్పిస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. కొణతాలపల్లి గ్రామంలో రూ.1.20 కోట్లతో వరదకాల్వ లిఫ్టు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగించేందుకు రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోమారు ఆశీర్వదించాలని కోరారు. పెద్దదేవులపల్లి గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నోముల భగత్కు గొర్రెపిల్లను బహూకరించారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా నిరంతర విద్యుత్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే అన్నారు. రాష్ట్రంలో 24గంటల కరెంట్ ఇస్తే గులాబీ కండువా కప్పుకొని బీఆర్ఎస్కు ప్రచారం చేస్తానని చెప్పిన జానారెడ్డి మాట తప్పాడన్నారు. అంతకుముందు ఏనాడూ ప్రజల వద్దకు వచ్చి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోలేని నాయకుడు నేడు ప్రజలను మభ్యపెట్టేందుకు మాయమాటలు చెబుతున్నాడని, అలాంటి వారి మాటలు నమ్మొద్దని కోరారు.
బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీని నమ్మితే రాష్ట్రం మరోసారి అంధకారంలోకి వెళ్తుందని రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్నాయక్ అన్నారు. సమైక్య పాలనలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్లో ఉంటూ సామాన్య ప్రజలకు దూరమయ్యారన్నారు. కానీ స్వరాష్ట్రంలో ఎమ్మెల్యే నోముల భగత్ నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణాలో రెండు పంటలకు నీళ్లు, 24 గంటల విద్యుత్, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు.
రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా భగత్కుమార్ను అధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బహునూతల నరేందర్ అధ్యక్షతన జరిగిన ప్రచార కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, నిడమనూరు, హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్లు మర్ల చంద్రారెడ్డి, జవ్వాజి వెంకటేశ్వర్లు, మహిళాధ్యక్షురాలు మాద ధనలక్ష్మి, ప్రధాన కార్యదర్శులు వెంకటాచారి, వనజ, పీఏసీఎస్ చైర్మన్లు నరేందర్రెడ్డి, జయరాంనాయక్, వైస్ చైర్మన్ గుండెబోయిన వెంకన్న, రైతుబంధు సమితి జిల్లా నాయకుడు శ్రీనివాస్రెడ్డి, గుండెబోయిన కోటేశ్యాదవ్, మాజీ ఎంపీపీ ధూలిపాల రామచంద్రయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జానయ్య, ఎంపీటీసీలు అంబటి రాము, ధనావత్ రవి, డైరెక్టర్లు దైద రవి, తిక్కబోయిన నాగరాజు, షేక్ ఖాసీం, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.