నందికొండ, ఫిబ్రవరి 9 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ప్రాజెక్టుల నీటిని రైతులకోసం సద్వినియోగం చేసింది. నాగార్జున సాగర్ ఆయకట్టుకు రెండు పంటలకు నీళ్లిచ్చింది. సాగునీటి ప్రాజెక్టులపై ఇతురులు పెత్తనం చేయకుండా కాపాడింది. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితులు లేకుండా పోతున్నాయి. నాగార్జునసాగర్ డ్యామ్పై పెత్తనం కోసం ఏపీ ప్రభుత్వం దౌర్జన్యానికి దిగి 13వ గేట్ వరకు ఆక్రమించింది. ఇష్టానుసారంగా కృష్ణానదిలోని నీటిని కుడి కాల్వ ద్వారా విడుదల చేసుకుంటున్నారు. డ్యామ్పైన పరిస్థితులను చక్కదిద్దే సాకుతో కేంద్రం జోక్యం చేసుకొని సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించి నాగార్జునసాగర్ డ్యామ్ను కృష్ణా రివర్ బోర్డు ఆధీనంలోకి తీసుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నది.
దీనికి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వంత పాడుతున్నది. నాగార్జునసాగర్ డ్యామ్ కేంద్రం ఆధీనంలోకి పోతే రాబోయే రోజుల్లో రాష్ట్ర రైతుల పరిస్థితి అధ్వానంగా మారనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు ఇబ్బంది పడకుండా ఎడమ కాల్వకు నీటిని విడుదల చేస్తూ ప్రతి ఏటా లక్షల ఎకరాలకు సాగు నీరు అందించింది. ప్రణాళికాబద్ధంగా 10 సంవత్సరాల్లో ఎడమ కాల్వకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో నీళ్లు ఇవ్వగా.. వరి, ఇతర ఆరుతడి పంటల సాగుతో దిగుబడి కూడా పెరిగింది. చివర ఉన్న ప్రతి మడికీ నీటిని అందించారు. ఎడమ కాల్వ, ఏఎమ్మార్, లోలెవెల్, హైలెవెల్ ప్రతి లిఫ్ట్ కింద ఉన్న పొలాలకు వెసులుబాటును బట్టి వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేశారు.