ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ శనివారం నాగార్జునసాగర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. బుద్ధవనంతో పాటు హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు ప్రపంచ స్థాయి బౌద్ధ క్షేత్రం బుద్ధవనాన్ని, జంటనగరాలకు తాగు నీరందించనున్న సుంకిశాల ఇన్టేక్ వెల్ పనులను ప్రారంభించారు. సాయంత్రం హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. మండుటెండల్లోనూ జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. సభ ఆసాంతం ఈలలు, చప్పట్లతో మార్మోగింది.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తున్నది. దాదాపు అర్ధశతాబ్దపు చీకట్లను చీల్చుకుంటూ ప్రగతి వెలుగులు ప్రసరిస్తున్నవి. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దిశగా ఏడాదిలో దాదాపు వెయ్యికోట్లతో పనులు జోరందుకున్నాయి. – మంత్రి కేటీ ఆర్
భవిష్యత్కు పునాది..
హైదరాబాద్ మహానగరానికి తాగునీటిని సరఫరా చేయడానికి ఉద్దేశించిన ఎత్తిపోతల పథకం సుంకిశాల. పెరుగుతున్న జనాభా, జంట నగరాల విస్తరణను దృష్టిలో ఉంచుకుని మరో వందేళ్ల వరకూ నీటి ఎద్దడి సమస్య రాకుండా రూ.1,450 కోట్ల అంచనా వ్యయంతో పంపింగ్ స్టేషన్ను ఇక్కడ నిర్మిస్తున్నారు. ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఉదయం 10గంటలకు హెలిప్యాడ్కు చేరుకుని పరిశీలించారు. సభ అనంతరం 11:17గంటలకు శంకుస్థాపన చేశారు.
ఏడాదిలోనే ఎంతో ప్రగతి..
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 40ఏండ్లలో జరుగని అభివృద్ధిని కేవలం ఏడాదిలోనే చేసి చూపించామని మంత్రి కేటీఆర్ అన్నారు. నాగార్జునసాగర్ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు. ఇప్పటికే దాదాపు వెయ్యికోట్లు కేటాయించామని, అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
బుద్ధుడికి పుష్పాంజలి
నాగార్జునసాగర్లో ప్రపంచ స్థాయి బౌద్ధ క్షేత్రం బుద్ధవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఉదయం 11.55 గంటలకు నందికొండలోని బీసీ గురుకులంలోని హెలిప్యాడ్కు చేరుకున్న మంత్రి కేటీఆర్ మధ్యాహ్నం 12.05గంటలకు బుద్ధుడి పాదాలకు పుష్పాంజలి ఘటించారు. 12.11 గంటలకు బుద్ధవనం శిలాఫలకం, 12.15 గంటలకు మహాస్థూపాన్ని ప్రారంభించారు.
దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు
దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకువచ్చారని మంత్రి కేటీఆర్ అన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని పది మంది లబ్ధిదారులకు దళితబంధు పథకం చెక్కులను మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్యే భగత్కుమార్తో కలిసి అందజేశారు.
జాతీయ పార్టీలతో తెలంగాణకు ద్రోహం…
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ తెలంగాణ రాష్ర్టానికి ద్రోహం తప్ప చేసిన మేలు ఏమీ లేదు. రాష్ట్రం రావడం మన అదృష్టమైతే.. ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం మరింత అదృష్టం. ప్రతిపక్ష పార్టీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని ఆడిపోసుకోవడం తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై పట్టింపులేదు. రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలకు అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. ఆ పార్టీల నాయకులు ప్రాజెక్టులపై కోర్టులకు వెళ్లి స్టేలు తీసుకువస్తున్నారు. ఆ రెండు జాతీయ పార్టీలను రాష్ట్ర ప్రజలు బహిష్కరించాలి.
– శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి
సుదీర్ఘ సమస్యలకు పరిష్కారం..
నాగార్జునసాగర్ నియోజకవర్గం గత పాలకుల నిర్లక్ష్యంతో అన్ని రంగాల్లో వెనుకబడింది. ప్రపంచ పర్యాటక కేంద్రమైన సాగర్ను గ్రామ పంచాయతీగా కూడా చేయకుండా విస్మరించారు. రాష్ట్ర ఏర్పాటుతో అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ నందికొండను మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. బుద్ధవనం ప్రాజెక్ట్ మన రాష్ర్టానికి తలమానికం. సీఎం కేసీఆర్ చొరవతోనే బుద్ధవనం ప్రాజెక్టు ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందేలా నిర్మాణం జరిగింది. ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. గత పాలకులు ఏండ్ల తరబడి పరిష్కరించలేని అనేక సమస్యలను ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ ఏడాది కాలంలోనే పరిష్కరించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న భగత్ కుమార్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
– విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి