నల్లగొండ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది. ఏ ఒక్క విభజన హామీలను నెరవేర్చని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ పార్టీ జాతీయ మహాసభలను హైదరాబాద్లో నిర్వహిస్తుండడం విడ్డూరంగా ఉంది. ఆ సభలకు ప్రధాన మంత్రి , కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు ఏ ముఖం పెట్టుకుని వస్తారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు.
మంగళవారం చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జాతీయ సభలకు వస్తున్న బీజేపీ నాయకులు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కళ్లు తెరవాలన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ వాటా తేల్చాలని, రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు కొత్త లైన్లు ఇవ్వడంతోపాటు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయ కోసం నీతి అయోగ్ చెప్పిన రూ. 20 వేల కోట్లను, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం వెయ్యి కోట్లను, ఎన్ఆర్ఈజీఎస్ కింద సర్పంచ్ లకు బకాయి ఉన్న రూ.12 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు.
తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడుగడుగునా అడ్డుకుంటుందని మండిపడ్డారు. కేంద్రం ధాన్యం కొనకుంటే రైతు పక్షపాతి అయిన కేసీఆర్ స్వయంగా ధాన్యం కొనుగోలు చేశారని ఆయన వివరించారు. తెలంగాణపై కేంద్రం కక్షసాధింపు ధోరణి విడనాడి తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని అన్నారు.