రామగిరి, జూన్ 29 : బక్రీద్ పర్వదినాన్ని గురువారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మిర్యాలగూడలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, సూర్యాపేటలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి బక్రీద్ వేడుకల్లో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ముస్లింలను కలిసి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. మరో వైపు తొలి ఏకాదశి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. నదీ స్నానాలు ఆచరించడంతోపాటు ప్రత్యేక పూజలు చేశారు.
సూర్యాపేట రూరల్, జూన్ 29 : త్యాగానికి ప్రతీక బక్రీద్ అని, సమాజ హితాన్ని కోరుకునే పర్వదినమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట పట్టణ పరిధిలోని జనగాం క్రాస్రోడ్డులోని బాషానాయక్తండా వద్ద ఈద్గాలో జరిగిన బక్రీద్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈద్గాలో ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లింలను మంత్రి స్వయంగా కలిసి అలాయ్ బలాయ్ చేసుకొని బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ సర్వమత సౌబ్రాతృత్వానికి తెలంగాణ ప్రతీకగా నిలిచిందన్నారు. గంగా జమునా తెహజీబ్ను కాపాడుకుంటూ తెలంగాణ ఆధ్యాత్మిక పరంపరను కొనసాగిస్తున్నామన్నారు. స్వరాష్ట్రంలో సుపరిపాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం మైనారీటీల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. మైనారిటీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు మైనారిటీ గురుకులాలు నెలకొల్పిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ జీడి భిక్షం, కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.
మోల్సాబ్ల ఆతిథ్యం స్వీకరణ
బొడ్రాయిబజార్ : మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్నేహనగర్కు చెందిన మోల్సాబ్ అబిద్ మౌలానా, భగత్సింగ్నగర్కు చెందిన మోల్సాబ్ అష్రఫ్ నివాసాలకు వెళ్లి వారి ఆతిథ్యం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బక్రీద్ పండుగ భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తుందన్నారు. దేశానికే ఆదర్శవంతమైన లౌకిక ఆధ్యాత్మిక కార్యాచరణ రాష్ట్రంలో అమలవుతుందని గుర్తుచేశారు. ఇస్లాం సహా మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.