చండూరు, అక్టోబర్ 23 : ‘మునుగోడు ప్రజలు నా కుటుంబ సభ్యులు. నన్ను గెలిపిస్తే ఈ ప్రాంత పాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రజల కాళ్లు కడుగుతా.’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. చండూరు మండలంలోని ఉడుతలపల్లి, పడమటితాళ్ల, దుబ్బగూడెం, కస్తాల, బోడంగిపర్తి, తాస్కానిగూడెం, శిర్దేపల్లి, గుండ్రపల్లి, చొప్పరివారిగూడెంలో ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత, రైతు, గిరిజనుల అభివృద్ధికి బీజేపీ వ్యతిరేకమన్నారు. మతోన్మాద పార్టీ అయిన బీజేపీని ఈ ఎన్నికల్లో మట్టుబెట్టాలని పిలుపునిచ్చారు. రాజగోపాల్రెడ్డి మునుగోడులో తన ఓటు తానే వేసుకోలేడన్నారు.
రాజగోపాల్రెడ్డికి మునుగోడు ప్రాంతంలో ఉన్న ఊర్ల పేర్లు ఇప్పటికీ తెలియదని ఎద్దేవా చేశారు. అలాంటి వారికి ఓటు వేస్తే మునుగోడు అభివృద్ధి జరుగదన్నారు. తాను 365 రోజులూ ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రతి గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశాన్ని ఆకర్షించేలా ఉన్నాయన్నారు. ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్కు పోటీ లేదన్నారు. అంతకుముందు ఉడుతలపల్లిలో మహిళలు బోనాలతో వచ్చి కూసుకుంట్లకు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు ఉన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక తర్వాత బీజేపీ పతనం
రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
మునుగోడు ఉప ఎన్నిక తర్వాత బీజేపీ పతనం కానున్నది. మోదీ హయాంలో దేశం నిలువు దోపిడీకి గురవుతున్నది. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వార్థ ప్రయోజనంతోనే మునుగోడు ఉప ఎన్నిక వచ్చింది. బీజేపీ ప్రభుత్వం నుంచి రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్ తీసుకున్నట్లు స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు. ప్రజలంతా టీఆర్ఎస్కు మద్దతుగా నిలువాలి. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి.