మునుగోడు ఉప ఎన్నిక భవితవ్యం మరో 24గంటల్లో తేలనుంది. ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. నల్లగొండ పట్టణంలోని ఆర్జాలబావిలో ఉన్న వేర్ హౌసింగ్ గోడౌన్స్లో కౌంటింగ్ జరుగనుంది. ఇందుకోసం ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కౌంటింగ్కు 21 టేబుళ్లు ఏర్పాటు చేయగా, 15 రౌండ్లలో లెక్కింపు పూర్తి కానుంది. మొదటగా చౌటుప్పల్ మండలం ఓట్లు, చివరగా గట్టుప్పల్ మండలం ఓట్లను లెక్కించనున్నారు. లెక్కింపు కేంద్రం వద్ద ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8గంటలకు ప్రారంభం కానుంది. తొలి అర్థగంట కొంత ఆలస్యమైనా గంటకు మూడు నుంచి నాలుగు రౌండ్ల ఫలితాలు వెల్లడి కావచ్చని తెలుస్తున్నది. ఇలా కొనసాగితే మధ్యాహ్నం 12 గంటల వరకు కౌంటింగ్ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.
యాదాద్రి భువనగిరి, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) ఉప ఎన్నిక పోటీలో 47మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఉదయం 5:30గంటలకే కౌంటింగ్ సిబ్బంది కేంద్రాలకు చేరుకోనుంది. లెక్కింపునకు మొత్తం 21టేబుళ్లు ఏర్పాటు చేశారు. 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తికానుంది. ఒక్కో రౌండ్లో 21 పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు.
మొత్తం 298 పోలింగ్ కేంద్రాల్లో నమోదైన ఓట్లను 15 రౌండ్లల్లో లెక్కిస్తారు. కౌంటింగ్ కోసం ప్రతి పార్టీ నుంచి 21మంది ఏజెంట్లను నియమించుకునేలా అధికారులు అనుమతిచ్చారు. మొదట పోలింగ్ ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ను ఓపెన్ చేసి.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. మునుగోడులో మొత్తం 686 పోస్టల్ ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్ల కౌంటింగ్ పూర్తయ్యాక ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నారు. మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9గంటలకు విడుదలవుతుంది. చివరి రౌండ్ ఫలితం ఒంటి గంటకు రానుంది.
కౌంటింగ్ వద్ద మూడంచెల భద్రత
అవాంఛనీయ సంఘటనలు, గొడవలు జరుగకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీఆర్పీఎఫ్ బలగాలతో సీసీ కెమెరాల పర్యవేక్షణలో 24గంటలపాటు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. లెక్కింపు కేంద్రంలోకి సెల్ఫోన్లు, వాటర్ బాటిళ్లు, సిగరెట్లు, మద్యం వంటి వాటిని అనుమతించరు. ఈసీ అనుమతి ఉన్న వారిని మాత్రమే కేంద్రాల్లోకి ప్రవేశం కల్పిస్తారు.
సజావుగా పోలింగ్
మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించామని ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి తెలిపారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని ఆర్జాలబావి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కౌంటింగ్ కేంద్రంలో ఉప ఎన్నికలో పోటీ చేసిన అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకుడు పంకజ్కుమార్తో కలిసి స్క్రూట్నీ నిర్వహించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళి, ఓటింగ్ శాతంపై అభ్యర్థులకు వివరించారు. మాక్ పోలింగ్, పీఓ డైరీ, ఏఎస్డీ ఓటర్లు, బ్యాలెట్ యూనిట్లు, సర్వీస్ ఓట్లు తదితర అంశాలపై తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉప ఎన్నిక పోలింగ్ సజావుగా జరిగేందుకు సహకరించిన రాజకీయ పార్టీలకు, పోటీ చేసిన అభ్యర్థులకు, ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. నవంబర్ 6న ఆర్జాలబావి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో కౌటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాహుల్శర్మ, భాస్కర్రావు, మునుగోడు రిటర్నింగ్ అధికారి, మిర్యాగూడ ఆర్డీఓ రోహిత్సింగ్ పాల్గొన్నారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఆర్పీఎఫ్ బందోబస్తు
ఆర్జాలబావి ఈవీఎంలు భద్రపరిచిన కేంద్రం వద్ద సీఆర్పీఎఫ్ బలగాలతోపాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో 24 గంటలపాటు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి తెలిపారు. 6న కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఈవీఎంల వద్ద భద్రత కొనసాగుతున్నదని చెప్పారు.
మొదటగా చౌటుప్పల్ ఓట్ల లెక్కింపు
కౌంటింగ్లో భాగంగా మొదటగా చౌటుప్పల్ మండల ఓట్లను లెక్కించనున్నారు. ఆ తర్వాత నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పల్ మండలాల ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్లో పాల్గొనే సిబ్బందికి మూడు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. జిల్లా ఎన్నికల అధికారి వినయ్క్రిష్ణారెడ్డి, ఈఆర్వో రోహింత్ సింగ్, కేంద్రం నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకుల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ ప్రక్రియను వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల ద్వారా చిత్రీకరించనున్నారు. లెక్కింపు కేంద్రాల్లో నిరంతరం విద్యుత్ ఉండేలా జనరేటర్లు, ఇన్వర్టర్లు అందుబాటులో ఉంచనున్నారు.