నీలగిరి, ఫిబ్రవరి 26 : దినదినాభివృద్ధి చెందు తూ ఆర్థిక ప్రగతి సాధించేందుకు ప్రభుత్వ యంత్రాంగాలు ముందుకు సాగుతుంటే నల్లగొండ మున్సిపాలిటీ మాత్రం ప్రగతికి నిధుల కేటాయింపులు తగ్గిస్తూ వెనక్కి వెళ్తున్నది. గత రెండు మూడు పర్యాయాలుగా ప్రతియేటా ఆర్థిక పరిస్థితిని పెంచుకుంటూ పోతున్న నల్లగొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చైర్మన్ స్థానాన్ని తీసుకొని రూపకల్పన చేసిన బడ్జెట్లో దాదాపు ఆరింతల కోత పెట్టారు.
రూ.719.23 కోట్లతో ఉన్న బడ్జెట్ను కేవలం రూ.125.78 కోట్లతో ఆమోదింప చేసుకున్నారు. 2022-23లో మున్సిపల్ బడ్జెట్ రూ.342.53 కోట్లు, 2023-24లో రూ.719.23 కోట్లు కాగా ఈ సంవత్సరం కేవలం రూ.125.78 కోట్లకు పరిమితమైంది. బడ్జెట్ను నాలుగు భాగాలుగా విభజించి తగ్గించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ గత బడ్జెట్లో అమృత్, ఎస్డీఎఫ్, టీఎఫ్ఐడీసీ నుంచి వచ్చే నిధులు బడ్జెట్లో చూపించడం వల్ల, పెరిగిందని, అందులో 10 శాతం నిధులు గ్రీనరీకి పెట్టాల్సి వచ్చేదని అన్నారు. ఇవి ఖర్చు చేయకపోవడం వల్ల అధికారులకు ఇబ్బందులు వస్తున్నాయని, అందుకే అలాంటి నిధులను బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు సభ్యులు మున్సిపల్ సమస్యలను లేవనెత్తారు. ఆస్తిపన్ను, నల్లా బిల్లులు, ఇతర మున్సిపాలిటీ ఆదాయలపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. వసూలు చేసిన పన్నులను వార్డుల వారీగా కేటాయించి ఖర్చు చేయాలని సూచించారు. పాతబస్తీ ప్రాంతంలో ఎప్పుడో కేటాయించిన ఇండ్లకు ఇంకా పాత యాజమానుల పేర్లే వస్తున్నాయని వాటిని తొలగించాలని బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ సభ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్గౌడ్, బీజేపీ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్, కౌన్సిలర్లు యామ కవితాదయాకర్, మారగోని భవానీగణేశ్, ఫర్జానా ఫర్హత్ ఇబ్రహీం, అలకుంట్ల రాజేశ్వరీమోహన్బాబు, ఖయ్యూంబేగ్, బోయినపల్లి శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, కొండూరు సత్యనారాయణ పాల్గొన్నారు.