నేరేడుచర్ల, మార్చి 27 : ఇంటి పన్ను చెల్లించడం లేదని సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో బానోత్ భీమా ఇంటిముందు గురువారం సాయంత్రం మున్సిపల్ సిబ్బంది ధర్నా చేశారు. ఈ ధర్నాను ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్ రెడ్డి వివరాలను వెల్లడించారు. స్థానిక మూడో వార్డులో నివసిస్తున్న బానోత్ భీమా 2015-2016 సంవత్సరం నుండి ఇంటి పన్ను చెల్లించకుండా బకాయి పడినట్లు తెలిపారు. మున్సిపల్ సిబ్బంది ప్రతినిత్యం ఇంటి పన్ను వసూళ్ల కోసం వెళ్తుండగా నేడు రేపు అని వాయిదా వేస్తూ చెల్లించడం లేదన్నారు. రహదారి సౌకర్యం లేదని, డ్రైనేజీ సౌకర్యం లేదని ఏదో ఒక సాకుతో పన్ను చెల్లించకుండా జాప్యం చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇటీవలే ఒత్తిడి చేయగా రూ.3 వేలు పన్ను చెల్లించాడని, ఇంకా రూ.27,542 పన్ను బకాయి ఉండగా ప్రభుత్వం కల్పిస్తున్న 90 శాతం వడ్డీ రాయితీని ఉపయోగించుకుని చెల్లించాలని తెలిపినప్పటికీ చెల్లించడం లేదన్నారు. గతంలో కూడా రెండుసార్లు వడ్డీ రాయితీ అవకాశం వచ్చినప్పటికీ చెల్లించలేదని దీంతో రెడ్ నోటీస్ జారీ చేసినప్పటికీ స్పందించలేదన్నారు. నేడు నీటి సరఫరా బంద్ చేసి, డ్రైనేజీ మూసివేసి సిబ్బందితో ధర్నా చేసినట్లు పేర్కొన్నారు. ఈ ధర్నాలో మున్సిపల్ మేనేజర్ యాకూబ్అలీ, వార్డు అధికారులు, ఆర్.పి లు పాల్గొన్నారు.