నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి11(నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ గతం కంటే 1.41 శాతం తగ్గింది. బుధవారం జరిగిన పోలింగ్లో జిల్లా సగటు పోలింగ్ శాతం 78.09గా నమోదైంది. నల్లగొండ కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా ఒకటి రెండు చోట్ల ఘర్షణలు, మరికొన్ని చోట్ల ప్రతిపక్షాల ఆందోళనలు, ఉద్రికత్తలు చోటు చేసుకున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 5 గంటలకు మెజార్టీ చోట్ల ముగిసింది.
ఒకటి రెండు చోట్ల మాత్రమే పోలింగ్ గడువు ముగిశాక కూడా నిర్ణీత సమయంలో లోపల ఓటర్లు బారులు తీరడంతో పోలింగ్ కొనసాగింది. కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ పరిస్థితిని పర్యవేక్షించారు. కాగా పోలింగ్ తొలి రెండు గంటలు, చివరి రెండు గంటలు మందకొడిగా కొనసాగింది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ 9 గంటల వరకు జిల్లా సగటు 11.20 శాతంగా నమోదైంది. తర్వాత 11 గంటల వరకు 27.03 శాతంగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 49.79 శాతంగా, మూడు గంటల వరకు 67శాతంగా నమోదైంది.
సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగగా, తుది పోలింగ్ శాతం 78.09గా జిల్లా సగటు పోలింగ్ నమోదైంది. నల్లగొండ కార్పొరేషన్లో 77.36 శాతం పోలింగ్ కాగా మున్సిపాలిటీల వారీగా పరిశీలిస్తే… అత్యధికంగా చండూరులో 91.52 శాతం నమోదు కాగా ఆ తర్వాత వరుసగా చిట్యాలలో 87.88శాతం, హాలియాలో 85.78శాతం, దేవరకొండలో 80.26శాతం, మిర్యాలగూడలో 77.44శాతం, అతి తక్కువగా నందికొండలో 59.68 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది.
రేపు కౌంటింగ్
ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8గంటల నుంచి మొదలుకానుంది. బుధవారం పోలింగ్ ముగిసాక బ్యాలెట్ బాక్స్లను కౌంటింగ్ కేంద్రాల్లోని స్ట్రాంగ్ రూమ్స్కు తరలించారు. రేపు ఉదయం ఇక్కడే కౌంటింగ్ చేపట్టనున్నారు.