Komatireddy Venkat Reddy | నల్లగొండ ప్రతినిధి, మార్చి6(నమస్తే తెలంగాణ) : కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అంటేనే రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువు. అవసరం లేనివి, సందర్భం కానివి, తన స్థాయికి మించినవి ఇలా ఎన్నో రకాలుగా వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండేందుకే ఆయన తాపత్రయం. బయటి పార్టీ వారిపై కంటే సొంత పార్టీ నేతలపై కామెంట్స్తోనే తన రాజకీయ జీవితాన్ని లాక్కురావడం ఆయనకే చెల్లింది. ఓ వైపు సొంత పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యమంటూనే మరోవైపు ఎప్పటికప్పుడు అడ్డుపుల్లలు వేయడంలో దిట్ట. ఎప్పుడు ఎవరితో కలిసుంటాడో, ఎవరితో కయ్యానికి కాలు దువ్వుతాడో అర్థం కాదని కాంగ్రెస్ శ్రేణులే తలలు పట్టుకుంటాయి. ఇక మునుగోడు ఉప ఎన్నికల నాటి నుంచి దగ్గరి అనుచరులు సైతం వెంకట్రెడ్డి తీరుతో విసిగిపోయి ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. కాంగ్రెస్ ఎంపీగా ఉండి, బీజేపీ నుంచి పోటీ చేసిన తమ్ముడు రాజగోపాల్రెడ్డిని గెలిపించాలని కోరడం పార్టీలో మరింత పలుచనవడం అందరికీ తెలిసిందే.
తాజాగా పీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న చెరుకు సుధాకర్ను, ఆయన కుమారుడు సుహాస్ను తన అనుచరులు చంపేస్తారని బెదిరించడంతో సొంత పార్టీలోని బలహీన వర్గాలు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు సైతం వెంకట్రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాయి. కోమటిరెడ్డి ఎప్పటిలాగే దీనిపై నాలుక తిప్పేసే ప్రయత్నం చేసినా చెరుకు సుధాకర్ ఈ వ్యవహారాన్ని సీరియస్గానే తీసుకుంటున్నట్లు స్పష్టమవుతున్నది. సోమవారం ఎస్పీ అపూర్వరావును కలిసి కోమటిరెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని సుహాస్ ఫిర్యాదు చేశారు. సుహాస్ ఫిర్యాదు మేరకు నల్లగొండ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కోమటిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తిన్నింటివాసాలు లెక్కించడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ది ప్రత్యేక కోణమేది స్పష్టం. తమ్ముడు రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచే ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పదవులు పొంది వ్యాపార ప్రయోజనాల కోసం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఉండి వెన్నుపోటు రాజకీయాలతో పబ్బం గడుపుకోవడం అలవాటు అని సొంత పార్టీలో ఉన్న విమర్శ. పీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ అతడిపై పదే పదే ఆరోపణలు చేస్తున్నాడని చెబుతూ ఏకంగా చంపేస్తారు అంటూ బెదిరించడం ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. చెరుకు సుధాకర్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరి రేవంత్రెడ్డికి దగ్గరగా ఉంటున్నాడు. ఇది వెంకట్రెడ్డికి జీర్ణం కావడం లేదన్నది పార్టీ వర్గాల్లో ఉన్న చర్చ.
ఇదే సమయంలో పలుమార్లు వెంకట్రెడ్డి గురించి చెరుకు సుధాకర్ చేసిన కామెంట్స్ అగ్గికి ఆజ్యం పోసేలా మారాయన్నది మరో ఆరోపణ. ఇవన్నీ ఎలా ఉన్నా… ఫోన్లో వెంకట్రెడ్డి చేసిన బెదిరింపు వ్యాఖ్యలపై సొంత పార్టీతో పాటు ఆయన అనుచరుల్లోనూ ఆగ్రహానికి కారణం అవుతున్నాయి. ఇదే సమయంలో బీసీ వర్గానికి చెందిన చెరుకు సుధాకర్ను ఏలా బెదిరిస్తారంటూ జిల్లా అంతటా బీసీ సామాజిక వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. రెండు రోజులుగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మల దహనాలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. గతంలోనూ అనేక సందర్భాల్లో ఇతర సామాజిక వర్గాల పట్ల కోమటిరెడ్డి వ్యవహారశైలిని ఈ సందర్భంగా మరోసారి తెరపైకి తెస్తున్నారు. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే బీసీ వర్గాలకు చెందిన నేతలను రాజకీయంగా వేధింపులకు గురిచేసింది నిజం కాదా అని ప్రశ్నిస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తీరుతోనే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వంగాల స్వామిగౌడ్, సుంకరి మల్లేశ్గౌడ్ వంటి వారు సైతం పార్టీని వీడి వెళ్లారని గుర్తు చేస్తున్నారు. తన చెప్పుచేతుల్లో ఉండే ఒకరిద్దరిని తప్ప… రాజకీయంగా ఎవ్వరినీ ఎదుగనివ్వలేదని మండిపడుతున్నారు.
చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి జీర్ణించుకోలేకనే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నాడని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమని ఓ వైపు చెబుతూ మరోవైపు ఇలా సొంతపార్టీలోని ఇతర నేతలను బెదిరించడంలో అర్థమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇలానే పలు సందర్భాల్లో రాష్ట్ర స్థాయిలోని కీలక వ్యక్తులపైనా ఎంపీ కోమటిరెడ్డి కామెంట్స్ చేయడం తెలిసిందే. మునుగోడు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోగా.. తమ్ముడి గెలుపు కోసం తాపత్రయ పడ్డారు. అయినా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీపరంగా తీసుకున్న చర్యలు ఏమీ లేకపోవడం గమనార్హం. దాంతో తాను ఏం మాట్లాడినా.. ఎవరిని బెదిరించినా ఎవ్వరేం చేయలేరన్న ధోరణి వెంకట్రెడ్డిలో కనిపిస్తుందని కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారు. కోమటిరెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా.. వచ్చే ఎన్నికల నాటికి ఎందులో ఉంటాడన్నది చాలా మందిలో ఉన్న సందేహం. ఇలాంటి వ్యక్తిని పార్టీ ఇంకా ఉపేక్షిస్తే మొదటికే మోసం వస్తుందని కాంగ్రెస్ శ్రేణులే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది.
తన వాళ్లు చంపేస్తారంటూ బెదిరించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుతూ డాక్టర్ చెరుకు సుహాస్ జిల్లా ఎస్పీ అపూర్వరావును కలిశారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో బీసీ, ఇతర ప్రజాసంఘాల నేతలతో కలిసి వినతిపత్రం అందించారు. తమ కుటుంబానికి వెంకట్రెడ్డి నుంచి ప్రాణహానీ ఉందని, రక్షణ కల్పించాలని అందులో విజ్ఞప్తి చేశారు. చట్టప్రకారం వెంకట్రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరారు. ఈ క్రమంలోనే మంగళవారం సుహాస్ ఫిర్యాదు మేరకు నల్లగొండ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కోమటిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లాలో బహుజన నాయకుల ఎదుగుదలను కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఓర్వలేడని మరోసారి ఈ ఘటనతో రుజువైందని ప్రజాసంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఇక జిల్లాలోనూ పలుచోట్ల వెంకట్రెడ్డి బెదిరింపు ధోరణిపై నిరసనలు వ్యక్తమయ్యాయి.
తాను భావోద్వేగంతోనే చెరుకు సుధాకర్పై అలా మాట్లాడినట్లు సోమవారం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయగా ఇంతలోనే ఆయన అభిమానుల పేరుతో ఓ బహిరంగలేఖ సోషల్మీడియాలో మరో వివాదానికి తెరలేపింది. అభిమానుల పేరుతో విడుదల చేసిన పోస్టులో వెంకట్రెడ్డిని ఏమైనా అంటే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ తరహాలో హెచ్చరించారు. ఆయన కోసం అవసరమైతే ఎంతవరకైనా వెళ్తాం అంటూ పేర్కొనడం మరింత వివాదాస్పదంగా మారింది. “కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే భావోద్వేగం. వెంకట్రెడ్డికి వ్యతిరేకంగా మాటలు కట్టిపెట్టాలి. లేదంటే చూస్తూ ఊరుకోం. ఆయన కోసం ఏం చేసేందుకైనా, ఎందాకైనా వెళతాం” అంటూ ఆయన అభిమానుల పేరుతో పరోక్ష హెచ్చరిక చేశారు. దీనిపై బీసీ, ఇతర ప్రజాసంఘాల నేతలు మరింత ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి బెదిరింపులు దేనికి సంకేతమని ప్రశ్నిస్తున్నారు. వెంకట్రెడ్డిపై చర్యలు తీసుకునేవరకు ఊరుకునేది లేదని బీసీ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.