నేరేడుచర్ల, మార్చి 26 : పది సంవత్సరాలు పండుగ వాతావరణంలో వ్యవసాయం చేసిన రైతులు ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో సాగు నీరు లేక అరగోస పడుతున్నారని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని బట్టనవానికుంటలో మంగళవారం నీళ్లు లేక ఎండి పోయిన రైతు దొండపాటి లచ్చిరెడ్డికి చెందిన వరి పంటను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన ముగిసినప్పటికీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు.
సాగర్ నీరు వస్తుందనే నమ్మకంతో బోర్లు, బావులు కింద రైతులు ధైర్యంగా వరి సాగు చేశారని, రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి నీటిని విడుదల చేయలేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 20లక్షల ఎకరాల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోయాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన రైతు ఆత్మహత్యలు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతున్నాయని, రాష్ట్రంలో ఇప్పటివరకు 180 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నాగార్జున సాగర్ జలాశయంలో ప్రస్తుతం 513 అడుగుల నీరు ఉందని, బీఆర్ఎస్ సర్కారులో 505 అడుగుల డెడ్ స్టోరేజీలోనూ నీటిని విడుదల చేసి సాగు, తాగునీటిని అందించి రైతులు, ప్రజలను ఆదుకుందని గుర్తు చేశారు.
కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఇంటింటీకి తాగు నీరు అందించే మిషన్ భగీరథ పథకం కాంగ్రెస్ పాలనలో మూలకు పడిందన్నారు. తుంగభద్ర, కర్ణాటక, శ్రీశైలం నుంచి కనీసం 10 టీఎంసీల నీటిని తీసుకొచ్చి సాగు, తాగు నీటిని విడుదల చేయాలని కోరుతున్నా రేవంత్ సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మనకంటే కింది ప్రాంతమైన ఖమ్మం జిల్లాలోని తిరుమలాయిపాలెం వరకు సాగర్ నీటిని అక్కడి మంత్రులు తీసుకుపోతే, హుజూర్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్కుమార్ రెడ్డి కనీసం పట్టించుకోలేదని అన్నారు. మనకు నీటిని విడుదల చేయకపోవడం వల్లే నేడు నల్లగొండ, సూర్యాపేట జిల్లాలు ఎడారిగా మారుతున్నాయని తెలిపారు.
ప్రభుత్వానికి ముందు చూపు లేక పోవడం వల్లనే నేడు నీరు లేక పంటలు ఎండి రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమ పార్టీ ధ్యేయమని తెలిపారు. నీళ్లు లేక పంటలు నష్టపోయిన రైతులను ఎకరానికి రూ. 25వేల చొప్పున ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విపత్తులతో పంట నష్టయిన రైతులకు బీఆర్ఎస్ సర్కారులో ఎకరానికి రూ. 10వేల చొప్పున చెల్లించినట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, రైతుబంధు రూ. 15వేలు ఇస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఊసే ఎత్తడం లేదన్నారు.
కనీసం పూర్తిస్థాయిలో రైతుబంధు కూడా విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించగా, యాసంగి ధాన్యం చేతికొస్తున్నా ఇప్పటికీ కాంగ్రెస్ సర్కారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఆయన వెంట డీసీసీబీ డైరెక్టర్ దొండపాటి అప్పిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు నాగండ్ల శ్రీధర్, కడియం వెంకట్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ చందమళ్ల జయబాబు, మాజీ ఎంపీపీ చెన్నబోయిన సైదులు, నియోజకవర్గ అధికార ప్రతినిధి పసుపులేటి నర్సింహారావు, మండల ప్రధాన కార్యదర్శి ఎల్లబోయిన లింగయ్య, ఉపాధ్యక్షుడు సుదర్శన్, నాయకులు పిచ్చిరెడ్డి, జెట్టి వెంకన్న, నాగార్జున, సుందరయ్య, వినాయకరావు, భరత్, నాగరాజు, శ్రీను, వెంకన్న, హుస్సేన్ ఉన్నారు.