యాదగిరిగుట్ట, మే 19 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువుడి నిత్యోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమశాస్త్రం ప్రకారం జరిపించారు. తెల్లవారుజామున స్వామికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామి వారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. సాయంత్రం స్వా మి, అమ్మవార్ల తిరువీధి, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు.
సుదర్శన నారసింహ హోమం పాంచరాత్రాగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. ఉదయం ఆలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ సుదర్శ నారసింహ హవనం చేశారు. వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి గజవాహన సేవ చేపట్టారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణమూర్తులకు పలు దఫాలుగా సువర్ణ పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. సాయంత్రం అద్దాల మండపంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా నిర్వహించే సేవలో మహిళా భక్తులు పాల్గొని తరించారు. ముత్తయిదువులు మంగళ హారతులతో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని అద్దాల మండపంలోని ఊయలలో శయనింపు చేసి గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటలు పాడారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామి వారి ఖజానాకు రూ.19,24,631 ఆదాయం సమకూరిందని ఈఓ గీత తెలిపారు.
శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు సాయికుమార్
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని సినీ నటుడు సాయికుమార్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం యాదగిరికొండకు చేరుకుని స్వయంభువుడికి ప్రత్యేక పూజలు చేసి ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేయగా ఆలయాధికారులు స్వామివారి ప్రసాదం అందించారు.