భువనగిరి కలెక్టరేట్/ బీబీనగర్, మార్చి 15: భువనగిరి మండలం తుకాపురంలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. తల్లి కుమార్తెను హత్య చేసి అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన రత్నకళ, తన కుమార్తె బెజ్జంకి కీర్తన రెడ్డి (14) గొంతు కోసి హత్య చేసింది. అనంతరం తన కుమారుడు బెజ్జంకి అంశాంత్ రెడ్డిపై కూడా కత్తితో దాడికి యత్నించింది. అయితే అంశాంత్ తప్పించుకొని కేకలు వేయడంతో గ్రామస్తులు అకడికి చేరుకున్నారు. ఈ ఘటన అనంతరం రత్నకళ ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.
ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు వెంటనే ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. రత్నకళకు బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బెజ్జంకి నరేందర్ రెడ్డితో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. గత రెండు సంవత్సరాలుగా ఆమె మానసికస్థితి సరిగా లేకపోవడంతో చికిత్స పొందుతోంది. రత్నకళ శనివారం రాత్రి జైనపల్లి నుంచి తన అమ్మగారి ఊరు తుకాపురానికి వెళ్లింది. అక్కడ ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల బీబీనగర్ మండలంలో వరుసగా జరుగుతున్న విషాద ఘటనలు స్థానికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం బీబీనగర్ పట్టణానికి చెందిన విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి చర్లపల్లిలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. అలాగే ఐశ్వర్య భర్తకు దూరంగా ఉంటూ మండలంలోని గొల్లగూడెం గ్రామానికి ఇటీవలే వచ్చింది. వచ్చిన రోజు రాత్రే తన ఇద్దరు పిల్లలను హత్య చేసి.. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కలకలం రేపుతోంది.