దళిత కుటుంబాల ఆర్థిక పురోభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం వెలుగులు నింపుతున్నది. దశలవారీగా నిధులు విడుదల చేస్తూ లబ్ధిదారులకు రూ.10లక్షలతో ఎంచుకున్న యూనిట్లు ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1200 మందిని ఎంపిక చేసి యూనిట్లు అందజేస్తున్నది. ఇవిగాక పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన తిరుమలగిరి మండలంలో2,060 మందికి, వాసాలమర్రిలో 76 మందికి యూనిట్లు పంపిణీ చేస్తున్నది. ఇందులో సగం మందికిపైగా యూనిట్లు ఏర్పాటు చేసుకొని లబ్ధి పొందుతున్నారు. తాజాగా ఒక్కో నియోజకవర్గానికి 1500 మందిని ఎంపిక చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజక వర్గాల్లో 18 వేల మందికి రూ.1800 కోట్లు అందనున్నాయి. తొలి విడుతగా నియోజకవర్గానికి 500 మందిని ఎంపిక చేయనున్నారు. నెలరోజుల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి యూనిట్లు పంపిణీ చేసే ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు.
సూర్యాపేట, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : అనాదిగా అంటరానితనానికి, అణచివేతకు గురై ఊర్లకు దూరంగా జీవచ్ఛవాలుగా జీవించిన దళితుల జీవితాల్లో ఇప్పుడిప్పుడే వెలుగులు ప్రసరిస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చాక రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లతోపాటు పలు రకాల అవకాశాలు కల్పించినప్పటికీ దశాబ్దాల తరబడి దళితులను ఏ ప్రభుత్వం కానీ, ఏ నాయకుడు కానీ పట్టించుకోలేదు. దాంతో వారికి కల్పించిన వాటిలో అరకొర హక్కులు తప్ప పూర్తి స్థాయిలో దక్కిన దాఖలాలు లేవు. అయితే.. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో దళిత జాతికి మేలు చేసేలా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. చిరు వ్యాపారాల నుంచి పరిశ్రమల ఏర్పాటు వరకు వారికి అత్యధిక అవకాశాలు కల్పిచండంతోపాటు గురుకులాలు, స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసి విద్యను చేరువ చేసిన విషయం విదితమే. అంతేకాకుండా దళితుల జీవితాల్లో సమూల మార్పు కోసం దళితబందు పథకాన్ని ప్రవేశపెట్టారు.
ఎలాంటి ఈఎంఐలు, షూరిటీలు అవసరం లేకుండా దశల వారీగా ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున నేరుగా అందించడమే ఈ స్కీమ్ ఉద్దేశం. గతేడాది తొలి విడుతగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి వంద చొప్పున 1200 కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. దీంతోపాటు యాదాద్రి జిల్లాలో సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాలమర్రిలో 75 కుటుంబాలతోపాటు తుంగతుర్తి నియోజకవర్గంలో తిరుమలగిరి మండల కేంద్రంలోని 2060 దళిత కుటుంబాలకు పది లక్షల చొప్పున అందజేశారు. తిరుమలగిరిలోని 2060 కుటుంబాలకు ప్రాసెస్ పూర్తి కాగా, త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా యూనిట్లను ప్రారంభించనున్నారు.
తొలి విడుతలో 6వేల మందికి రూ.600 కోట్లు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా.. ఒక్కో నియోజకవర్గంలో ఈ ఏడాది విడుతల వారీగా 1500 మంది దళితులకు దళితబంధు వర్తింపజేయనున్నారు. తొలి విడుతగా నియోజకవర్గానికి 500 చొప్పున 12 నియోజకవర్గాల్లోని ఆరు వేల మంది దళిత కుటుంబాలకు రూ.600 కోట్లు అందనున్నాయి. శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం మేరకు ఆయా నియోజకవర్గాల్లో వెంటనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. నేడో రేపో జిల్లాలకు ఉత్తర్వులు అందనుండగా వెనువెంటనే అధికారులు రంగంలోకి దిగి లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు. ఈ తతంగం మొత్తం నెల రోజుల్లోపే పూర్తి చేసి లబ్ధిదారులకు యూనిట్లను గ్రౌండింగ్ చేయనున్నట్లు తెలుస్తుంది.
సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్
దేశంలో ఎక్కడా లేని దళితబంధు పథకం అమలు చేస్తున్న కేసీఆర్ దమ్మున్న ముఖ్యమంత్రి. మొదట పైలెట్ ప్రాజెక్టుగా, ఆ తర్వాత నియోజకవర్గానికి వంద మంది చొప్పున.. ఇప్పుడు నియోజకవర్గానికి 500 మందికి దళిత బంధు అమలు చేస్తామని నిర్ణయించడం గొప్ప విషయం. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దళితులకు ఇంత గొప్పగా ఎవరూ చేయలేదు. వారి స్థితిగతులు మార్చి, ఆర్థికంగా బలపడేలా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత పక్షపాతి. ఏ ముఖ్యమంత్రీ దళితులకు ఇలాంటి పథకాలు అమలు చేయలేదు. దళితుల సంక్షేమానికి ఎంతగానో పాటుపడుతున్న కేసీఆర్ అభినవ అంబేద్కర్.
– కందుకూరి లక్ష్మయ్య మాదిగ, తిరుమలగిరి
స్వరాష్ట్రంలో దళితుల కష్టాలు తీరినై..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దళితుల కష్టాలు తీరినై. దళితులను ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ఈ ఏడాది నియోజకవర్గానికి 500 మందికి దళితబంధు ఇస్తామని ప్రకటించడం సంతోషకరం. దళితుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెడుతున్న సీఎం కేసీఆర్కు దళితుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు.
– బాణాల కవిత, జడ్పీటీసీ, నడిగూడెం
దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి
దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే దళితబంధు పథకం ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద దళితులకు 10లక్షల రూపాయలు ఇస్తున్నారు. ముందుగా నియోజకవర్గానికి వంద మందికి ఇవ్వడం హర్షణీయం. ఇప్పుడు నియోజకవర్గానికి 1500 కుటుంబాలకు ఇస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 118 నియోజకవర్గాల్లో లక్షా 77వేల మంది దళితులకు లబ్ధి చేకూరడం చరిత్రలో ఇదే మొదటిసారి.
– ఇరుగు పిచ్చయ్య, దళిత సంఘం నాయకుడు, రఘునాథపాలెం, మఠంపల్లి మండలం
దళితబంధు చరిత్రాత్మకం
ఈ ఆర్థిక సంవత్సరం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి విడుతగా 500 మందికి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 59వేల మందికి దళితబంధు అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం హర్షణీయం. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా దళితుల అభివృద్ధ్ది, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నది. దళితులు ఊహించని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన దళితబంధు పథకం ప్రవేశపెట్టడం చరిత్రాత్మకం. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వివక్షకు గురవుతున్న దళితులను అభివృద్ధి చేసేందుకు దళితబంధు ఎంతో ఉపకరిస్తుంది. దళితుల పక్షపాతిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి దళితులు ఎప్పుడూ రుణపడి ఉంటారు.
– తలమళ్ల హసేన్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, సూర్యాపేట
నియోజకవర్గంలో 500 మందికి ఇవ్వడం హర్షణీయం
ఒక్కో నియోజకవర్గంలో మరో 500 మందికి దళితబంధు ఇస్తామని ప్రకటించడం హర్షణీయం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా కేంద్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క ప్రభుత్వమూ దళితుల అభివృద్ధి గురించి ఆలోచన చేయలేదు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల్లోనూ కమీషన్లకు కక్కుర్తిపడ్డ నాయకులను చూశాం. ఇన్నేండ్లలో దళితుల అభివృద్ధికి కృషి చేస్తున్న ఒకేఒక్కడు సీఎం కేసీఆర్. దళితుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– కలకొండ శ్యాంసన్, వట్టిఖమ్మంపహాడ్, చివ్వెంల