రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్
కోదాడ టౌన్, జూలై 1 : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, రాష్ర్టానికి రావాల్సిన నిధుల గురించి చర్చించి బీజేపీ నాయకులు ఇప్పించాలని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ కార్యవర్గ సమావేశానికి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల నుంచి జన సమీకరణకు ఇతర రాష్ర్టాల నాయకుల్ని తీసుకొచ్చి డబ్బులు పంచుతూ గారడి చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు గడిచినప్పటికీ విభజన చట్టాలను నెరవేర్చకపోగా రాష్ట్రంపై మోదీ ప్రభుత్వం విషం చిమ్ముతుందని విమర్శించారు. రాజ్యసభ సాక్షిగా తెలంగాణ విభజనపై వెకిలి మాటలు మాట్లాడిన మోదీ ఈ రెండు రోజులు రాష్ట్ర అభివృద్ధిని చూడాలని తెలిపారు. రాష్ట్రం కేంద్రానికి రూ.3,060 కోట్లు పన్ను రూపంలో చెల్లిస్తే, కేంద్రం మాత్రం రాష్ర్టానికి రూ.1,060 కోట్లు మాత్రమే పంపిందని పేర్కొన్నారు. తెలంగాణకు నవోదయ పాఠశాలలు, బయ్యారం ఉక్కు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సీటీ, సిమెంట్ కర్మాగారం తదితర ప్రాజెక్టులు తెలంగాణకు ఇవ్వాల్సి ఉండగా కేంద్రం నేటికీ వాటిపై స్పష్టత ఇవ్వలేదని తెలిపారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ ప్రాజెక్టులపై చర్చించి తెలంగాణకు ఇవ్వాలని కోరారు. దేశం దివాలా తీసేలా ఎల్ఐసీ, ఎయిర్ ఇండియా, రైల్వే లాంటి వాటిని కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గ్రామానికి మొన్నటి వరకు కరెంటు లేకపోవడం బీజేపీ పాలిత రాష్ర్టాల అభివృద్ధికి నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్కు జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 శాసనసభ, 2 పార్లమెంట్ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ అధిక మెజార్టీతో కైవసం చేసుకుంటుందన్నారు. ఎంత మంది టూరిస్టులు వచ్చినా వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సుధారాణి, కోదాడ ఎంపీపీ చింతా కవిత, నాయకులు పాల్గొన్నారు.