నకిరేకల్, అక్టోబర్ 24: రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తుల పూర్వ వైభవం తీసుకురావడానికి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. పెరుగుతున్న శాస్త్ర,సాంకేతిక రంగాలను ఉపయోగించి రజకులకు మోడ్రన్ ధోబీఘాట్లను నిర్మిస్తున్నది. ఒకప్పుడు రజకులు దుస్తులు పట్టుకుని చెరువులు, కుంటల వైపు వెళ్లేవారు. ప్రభుత్వం వారి బాధలు చెక్ పెడుతూ ప్రతి మున్సిపాలిటీలో పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగం ద్వారా రూ.2 కోట్లు నిధులు కేటాయించి మోడ్రన్ ధోబీఘాట్ నిర్మిస్తున్నది. మరో రెండు నెలల్లో ధోబీఘాట్ అందుబాటులోకి రానుంది. నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో 350 రజక కుటుంబాలున్నాయి. 150 నుంచి 200 కుటుంబాలు రజక వృత్తిమీద ఆధారపడి జీవిస్తున్నాయి. రోడ్డు వెంట 35 నుంచి 40 లాండ్రీ దుకాణాలు రజకులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ప్రతి లాండ్రీ దుకాణం 250 యూనిట్లు ఉచిత కరెంటు అందిస్తున్నది. పట్టణంలోని ఇసాయికుంట కట్టపై రూ.2 కోట్లతో మోడ్రన్ ధోబీఘాట్ నిర్మిస్తున్నారు. 700 గజాల్లో పెద్ద షెడ్డు నిర్మిస్తారు. అనంతరం యంత్రాలను అమరుస్తారు. ఆధునాతన విధానంలో ఉతికే యంత్రాలు, ఉతికిన వాటిని ఆరబెట్టే యంత్రాలు, తరువాత ఇస్త్రీ చేసి పెట్టే యంత్రాలను ప్రభుత్వమే సమకూర్చనుంది. గంటకు ఒక సైకిల్ చొప్పున 240 దుస్తులు ఉతికి ఇస్త్రీ చేసే యంత్రాలను రూపొందించారు. ఒక షిప్టులో ఎనిమిది సైకిళ్లు ఉంటాయి. 1,920 దుస్తులు ఉతుకుతాయి. రెండు షిప్టుల్లో అయితే 3,840 దుస్తులను ఉతికి ఇస్త్రీ చేసే యంత్రాలను రూపొందించారు. గతంలో సర్ఫ్, సబ్బు, సోడా వాడడంతో దుస్తులు పాడవుతుండేవి. రజకులు కూడా అనారోగ్యాల పాలయ్యేవారు. ప్రస్తుత ఆధునిక యంత్రాల ద్వారా ఎలాంటి ప్రమాదాలు రాబోవని అధికారులు చెబుతున్నారు.
రెండు నెలల్లో మోడ్రన్ ధోబీఘాట్
నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో మోడ్రన్ ధోబీఘాట్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 2 కోట్లు కేటాయించింది. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయి. మరో రెండు నెలల్లో మోడ్రన్ అందుబాటులోకి రానుంది. పూర్తిస్థాయిలో మిషనరీ వస్తుంది. మున్సిపాలిటీ ప్రజలకు ధోబీఘాట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రజక వృత్తిదారులకు మరింత ఉపాధి లభించే అవకాశం ఉంది.
– బాలాజీ, మున్సిపల్ కమిషనర్
ఎమ్మెల్యే చిరుమర్తికి రుణపడి ఉంటాం
నకిరేకల్ పట్టణంలో రూ.2 కోట్లతో ప్రభుత్వం ఆధునిక దోబీఘాట్ నిర్మిస్తున్నది. మాకు చాలా సంతోషంగా ఉంది. లాండ్రీ షాపులకు 250 యూనిట్లు కరంటు ఇస్తున్నది. రజక వృత్తిని తెలంగాణ ప్రభుత్వం కాపాడుతుంది. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు రజకులమంతా రుణపడి ఉంటాం. మరో రూ.25 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తానని ఎమ్మెల్యే హామీనిచ్చారు. రజకులందరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుంటాం.
-పగిళ్ల వెంకన్న, రజక సంఘం పట్టణాధ్యక్షుడు, నకిరేకల్