స్వరాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధితోపాటు ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని.. సీఎం కేసీఆర్ దత్తతతో నల్లగొండ రూపురేఖలే మారిపోయాయని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండలో 60 ఏండ్లలో జరుగని అభివృద్ధి నాలుగేండ్లలోనే చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా మొక్కవోని దీక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. అలాగే చందంపేట మండల బీఆర్ఎస్ సమ్మేళనంలో ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ పాల్గొని మాట్లాడారు.
నీలగిరి, ఏప్రిల్ 11 : నల్లగొండ అంటే ఆనాడు ఎర్రగొండ అనేవారు.. నేడు సీఎం కేసీఆర్ దత్తతతో వేలాది కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో నయా నల్లగొండగా రూపుదిద్దుకున్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్లో మంగళవారం బీఆర్ఎస్ టూ టౌన్ ఏరియా ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నల్లగొండకు వేలాది కోట్ల రూపాయలు మంజారు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. 60, 70 ఏండ్లలో జరుగని అభివృద్ధి ఈ నాలుగేండ్లలో జరిగిందని చెప్పారు. సీఎం కేసీఆర్ కృషితో ఇటు వ్యవసాయ రంగంలో, అటు అభివృద్ధిలో రెండు కండ్ల మాదిరిగా దూసుకుపోతున్నదన్నారు. మిషన్ కాకతీయ, రైతుబంధు వంటి కార్యక్రమాలతో వ్యవసాయం పండుగలా మారిందని తెలిపారు. దేశవ్యాప్తంగా 54లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తే.. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 40లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా మొక్కవోని దీక్షతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని చెప్పారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కేంద్రం ధాన్యం కొనబోమని చెప్తే.. రాష్ట్ర ప్రభుత్వమే ప్రతి గింజనూ కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారని అన్నారు. ప్రజా సంక్షేమం నుంచి మోదీ సర్కారు తప్పుకొనే కుట్ర చేస్తున్నదని విమర్శించారు. అందులో భాగంగానే ప్రజలకు అందించే బియ్యంలో కోత విధించిందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ.3లక్షల పథకాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు.
రైతుల కష్టాలు తీర్చిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాక ముందు ఉదయ సముద్రంలో నీళ్లున్నా రైతులకు కన్నీళ్లే ఉండేవని, ఒక్క పంట పండించేందుకు అనేక తంటాలు పడేవారని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. కరెంటు సక్రమంగా రాక ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి రైతులు అర్ధరాత్రి ఇండ్లు వదిలి పొలాల దగ్గర పడిగాపులు కాసేవారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు సీఎం కేసీఆర్ 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తుండడంతో ఇబ్బందుల్లేకుండా రెండు పంటలు పడిస్తున్నారని అన్నారు. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, రైతుబంధు అందిస్తుండడంతో వ్యవసాయం పండుగలా మారిందని తెలిపారు. పంటల దిగుబడిలో తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నదని, జిల్లాలో నల్లగొండ నియోజకవర్గం అగ్రస్థానంలో నిలిచిందని అన్నారు. ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా లక్షా నూటపదహారు రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని చెప్పారు. మహిళల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలుస్తున్నారన్నారు. గురుకులాలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్య అందిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ పేదల కడుపు నింపుతుంటే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వారి పొట్ట కొడుతున్నదని విమర్శించారు. భారతదేశం దొంగలు, దోపిడీదారులు, క్రిమినల్స్ ఏలుతున్న రాజ్యాంగా మారిపోయిందన్నారు. దేశాన్ని నరేంద్ర మోదీ అనుచరులు దోచుకుంటున్నారని విమర్శించారు. మోదీ సర్కారు ప్రతి ఇంటి నుంచి రూ.15వేల నుంచి రూ.20వేల వరకు అనేక రూపాల్లో దోచుకుంటున్నదన్నారు. ప్రజలు, రైతులు అందరూ సంతోషంగా ఉండాలని సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టడాన్ని వ్యతిరేకించడంతో కేంద్రం నుంచి తెలంగాణకు రావలసిన నిధులు రాకుండా మోదీ అడ్డుకున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నదన్నారు. అనాడు శ్రీరాముడు 14 సంవత్సరాలు అరణ్య వాసం చేసి పట్టాభిషేకం పొందితే.. ఈనాడు సీఎం కేసీఆర్ 14 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమం చేసి రాష్ర్టాన్ని సాధించి మంచి పాలన అందిస్తున్నారని అన్నారు. నల్లగొండ పట్టణం 20 ఏండ్లు రాక్షసుల చేతిలో నలిగిపోయిందని, తాను గెలిచిన తర్వాత రూ.1200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అభివృద్ధి ఇలాగే కొనసాగాలన్నా, నల్లగొండకు మరిన్ని నిధులు రావాలన్నా సీఎం కేసీఆర్ను మరోసారి గెలిపించాలని కోరారు. నల్లగొండ పట్టణం, నియోజకవర్గం సంపూర్ణ ప్రగతి సాధించాలంటే మరో రెండున్నర సంవత్సరాలు పడుతుందన్నారు.
-ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి
బీఆర్ఎస్ పాలనలో కనీవిని ఎరుగని అభివృద్ధి
నల్లగొండ పట్టణంలో గతంలో ఇరుకు రోడ్లు, మురుగు కాల్వలు, వీధిలైట్లు సక్రమంగా లేక ప్రజలు నరక యాతన పడ్డారని జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి అన్నారు. మంచినీళ్లు వారానికోసారి వచ్చేవని, అవి కూడా ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉండేదని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక, భూపాల్రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక కనీవిని ఎరుగతి రీతిలో అభివృద్ధి జరుగుతున్నదన్నారు. నల్లగొండకు నలు వైపులా సువిశాలమైన రోడ్లు, జంక్షన్లు, ఆహ్లాదం కోసం ప్రత్యేకంగా పార్కులు, పట్టణ కూడళ్లలో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ప్రతి వీధిలో సీసీ రోడ్లు, వీధిలైట్ల సమస్యను శాశ్వతంగా పరిష్కరించగలిగామన్నారు. నల్లగొండ ప్రజల దాహర్తిని తీర్చేందుకు ప్రతిరోజూ మంచినీళ్లు అందిస్తున్నామని చెప్పారు. నల్లగొండ పట్టణంలో త్వరలో 24 గంటలపాటు కృష్ణాజలాలు వచ్చేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ రాకముందు రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని, విద్యుత్ కోతలతో పంటలు సక్రమంగా పండక, మద్దతు ధర అందక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. మరికొంత మంది భూములను అమ్ముకొని హైదరాబాద్ వంటి నగరాలకు వలస పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలో చెరువుల అభివృద్ధి, 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు ఇస్తుండడంతో వ్యవసాయం నేడు పండుగలా మారిందని చెప్పారు.
-జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్రెడ్డి
ఉర్రూతలూగించిన సాయిచంద్ ఆటాపాట
రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ తన ఆటపాటలతో పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత, పోరాడి సాధించిన తీరు, రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పాటలు పాడి ఉర్రూతలూగించారు. ఆయన పాటలు పాడుతుంటే నాయకులు, కార్యకర్తలు ఈలలు, చప్పట్లతో గొంతు కలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, వ్యవసాయ మారెట్ కమిటీ చైర్మన్ పంకజ్ యాదవ్. పార్టీ నాయకులు మాలె శరణ్యారెడ్డి, మామిడి పద్మ, జయప్రదరెడ్డి, కత్తుల సంధ్య, ఆలకుంట్ల మొహన్బాబు, ఇబ్రహీం, భాసర్గౌడ్, పూజిత, నాగరత్నంరాజు, శ్రీనివాస్, కవిత, జనార్దన్రావు, సహదేవరెడ్డి, శ్రీనివాస్, శ్రీను, గణేశ్, రవీందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.