యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) ;పదో తరగతి విద్యార్థినుల ఆత్మహత్య మిస్టరీ వీడటం లేదు. విషాదం జరిగి నాలుగు రోజులైనా సూసైడ్కు గల కారణాలు ఇంకా తేలలేదు. జిల్లాలో ఎక్కడ చూసినా దీనిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మరోవైపు విధుల్లో నిర్లక్ష్యం వహించారని హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేశారు. భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మంగళవారం ఎస్సీ హాస్టల్ను సందర్శించి, విద్యార్థులకు భరోసా కల్పించారు.
ఆధారాలు సేకరించినా..
పట్టణంలోని ఎస్సీ హాస్టల్లో ఈ నెల 3వ తేదీన విద్యార్థినులు భవ్య, వైష్ణవి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనా స్థలంలోనే సూసైడ్ లెటర్ బయటపడింది. ఇది జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా ఆత్మహత్యలకు గల కారణాలు ఇంకా తేలలేదు. ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఘటన రోజు, తెల్లారి వివరాలు సేకరించారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ సూసైడ్ నోట్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. నాలుగు రోజులుగా దర్యాప్తు చేస్తున్నా ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
వార్డెన్ సస్పెన్షన్
విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఎస్సీ హాస్టల్ వార్డెన్ శైలజను ఎట్టకేలకు సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ హన్మంతు కె.జెండగే మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కాగా ఘటనకు బాధ్యులను చేస్తూ విద్యార్థుల పేరెంట్స్ ఆరుగురిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఒక్కరినే సస్పెండ్ చేయడంపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.
విచారణాధికారిగా నాగలక్ష్మి..
సూసైడ్ కేసు విషయంలో ఓ వైపు పోలీసులు దర్యాప్తు చేపడుతుండగా, మరోవైపు శాఖాపరమైన విచారణ చేపట్టనున్నారు. డిప్యూటీ కలెక్టర్ నాగలక్ష్మిని విచారణాధికారినిగా నియమించారు. ఈ మేరకు యాదాద్రి భువనగిరి కలెక్టర్ హన్మంతు కె. జెండగే ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థుల కోసం ఇతర భవనాల్లోకి..
ప్రస్తుతం సాయి కృప డిగ్రీ కళాశాలలో ఎస్సీ హాస్టల్ నడుస్తున్నది. ఇటీవల విద్యార్థుల ఆత్మహత్యతో స్టూడెంట్స్ భ యాందోళనకు గురై హాస్టల్ను ఖాళీ చేశారు. తల్లిదండ్రులు దగ్గరుండి సొంతూర్లకు తీసుకెళ్లారు. పదో తరగతి పరీక్షలు దగ్గ ర పడుతున్న నేపథ్యంలో టెన్త్ విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. హాస్టల్లో 14 మంది పదో తరగతి విద్యార్థులు చదువుతుండగా వారిని పట్టణంలోని ఆశ్రమ పాఠశాలలోకి తరలించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మిగతా తరగతుల విద్యార్థుల కోసం వేరే భవనం ఏర్పాటు చేయడం లేదా దగ్గరలోని ఇతర హాస్టళ్లు, కేజీబీవీలకు తరలించాలని భావిస్తున్నారు.
ఎస్సీ హాస్టల్ను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత
కేంద్రంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఎస్సీ హాస్టల్ను భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సందర్శించారు. సూసైడ్ చేసుకున్న పరిస్థితులను తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఉండాలని స్టూడెంట్స్కు భరోసా కల్పించారు. కేసును పారదర్శకంగా విచారించి, దోషులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.