మోతె, ఫిబ్రవరి 20 : గురుకుల పాఠశాలల్లో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు కలిచి వేస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇమాంపేట గురుకుల విద్యార్థిని ఆస్మిత ఇటీవల ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె సొంతూరు మోతె మండలం బుర్కచర్లకు మంగళవారం కవిత వెళ్లారు. ఆస్మిత తల్లిని, కుటుంబ సభ్యులను ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్తో కలిసి పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెంటనే గురుకుల పాఠశాల పనితీరుపై సమీక్షించి ఆడబిడ్డల ప్రాణాలను కాపాడాలన్నారు. 10రోజుల్లో ఇమాంపేటలోని పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. రెండు వారాల క్రితం భువనగిరి గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు పరీక్షల ఒత్తిడితో ఉన్నారా అన్నది ప్రభుత్వం ఆలోచన చేయాలన్నారు.
గురకులాలను ఏర్పాటు చేసి లక్షలాది మంది పిల్లలను చదివిస్తున్న నేపథ్యంలో ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతుంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఆడపిల్లలు సున్నితంగా ఉంటారు కాబట్టి ఆత్మహత్య చేసుకునేంత స్థాయికి ఎందుకు ఒత్తిడి చేస్తున్నారని, సమయానికి సిలబస్ పూర్తి, నాణ్యమైన ఆహారం అందించడంతోపాటు విద్యార్థినులకు కౌన్సెలింగ్ ఇప్పించాలని కోరారు. ప్రస్తుతం విద్యా శాఖకు పూర్తి స్థాయి మంత్రి లేరని, దీనిపై సీఎం చొరవ తీసుకోవాలన్నారు. ప్రతి హాస్టల్లో ఫ్రెండ్లీనేచర్ కల్పించాలని, సైకాలజిస్ట్లను ఏర్పాటు చేసి విద్యార్థుల్లో మనోధైర్యం నింపాలని సూచించారు. మృతి చెందిన విద్యార్థినుల కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం ఆస్మిత తల్లి ఇరుగు జ్యోతికి కవిత ఆర్థిక సాయం అందజేశారు.
అనంతరం ఆస్మిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శీలం సైదులు, నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు, మిక్కిలినేని సతీశ్, కొండా వెంకన్న, నూకల శ్రీనివాస్రెడ్డి, వాసంశెట్టి రమేశ్, భూక్య గాంధీ, బాణోతు వెంకన్న, దేవ్లానాయక్, లక్కపాక ప్రవీణ్కుమార్, సంజీవరెడ్డి, జాన్రెడ్డి, గుండాల గంగులు, శంకర్నాయక్, మహేందర్ ఉన్నారు.