ఆలేరు, డిసెంబర్ 4 : తెలంగాణ రాష్ర్టానికి టీఆర్ఎస్ పార్టే శ్రీరామరక్ష అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గుండాల మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కాసగల్ల మహేశ్ (ఎమ్మెల్సీ కవిత కారు డ్రైవర్) వివాహం ఆలేరు పట్టణంలోని ఏఎన్ఆర్ గార్డెన్స్లో ఆదివారం జరిగింది. ఎమ్మెల్సీ కవిత, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డితో కలిసి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు. సీఎం కేసీఆర్ వంటి ఉద్యమ నేపథ్యం కలిగిన నాయకుడు లేరని, ఇక రారని పేర్కొన్నారు.
ప్రాణాలను లెక్క చేయకుండా స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా ముందుకు సాగిన మహోన్నతుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్దే విజయమని చెప్పారు. కనీవిని ఎరుగని రీతిలో యాదాద్రి అభివృద్ధి జరిగిందన్నారు. యాదాద్రి దేవస్థాన నిర్మాణం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని తెలిపారు. రకరకాల పార్టీలు వచ్చినా రకరకాలుగా మభ్యపెట్టినా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పట్టించుకోవద్దన్నారు.
జిల్లా ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు ప్రభుత్వ విప్ సునీతక్క వెంటే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆలేరు మున్సిపల్ చైర్మన్ వసునూరి శంకరయ్య, టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశ్, మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, కౌన్సిలర్లు భేతి రాములు, రాయపురం నర్సింహులు, ఆర్టీఏ మెంబర్ పంతం కృష్ణ, నాయకులు పత్తి వెంకటేశ్, ముదిగొండ శ్రీకాంత్, మొరిగాడి వెంకటేశ్గౌడ్, గ్యారపాక నాగరాజు పాల్గొన్నారు.