గరిడేపల్ల్లి, నవంబర్ 26 : ప్రజా సేవకుడిని గుర్తించి వచ్చే ఎన్నికలో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని రాయినిగూడెం, కీతవారిగూడెం, తాళ్లమొల్కాపురం, రేగులగడ్డ తండా, కొత్తగూడెం, లచ్యాతండా, రంగాపురం, వెలిదండ గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు.
నియోజకవర్గంలో 20 ఏండ్లలో జరుగని అభివృద్ధిని కేవలం నాలుగేండ్లలో చేసి చూపానన్నారు. రైతులకు రైతుబంధు, బీమా అందించడంతో పాటు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరాను అందిస్తున్న ఘనత బీఆర్ఎస్దేనన్నారు. వానాకాలం వరి సాగు చివరి దశలో నీరు లేక పొలాలలు ఎండుతున్న తరుణంలో సాగర్ డెడ్ స్టోరేజ్లో ఉన్నా సీఎం కేసీఆర్తో మాట్లాడి నీరు ఇప్పించామన్నారు. ఉత్తమ్ దంపతులకు పదవీ వ్యామోహం తప్ప ప్రజలపై ప్రేమ లేదన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే వారు ఇక్కడికి టూరిస్టు నేతల్లా వస్తారన్నారు.
తనది ప్రజలకు సేవ చేయాలనే అభిమతమని, అందుకే నియోజకవర్గంలో గతంలో జరగని అభివృద్దిని చేసి చూపానన్నారు. జనాల్లో బలం లేని ఉత్తమ్ రోలర్, రోటీమేకర్, ట్రాక్టర్ వంటి గుర్తులను పెట్టించి అక్రమంగా గెలిచేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. తాను ఎల్లప్పుడూ అభివృద్ధి గురించే ఆలోచిస్తానన్నారు. గోదావరి జలాలు తెచ్చి హుజూర్నగర్ ప్రాంత రైతుల పొలాలను పారించడమే తన ధ్యేయమన్నారు. అదేవిధంగా మూసీ నీటిని సాగర్ కాల్వలోకి పోయించి ఈ ప్రాంత రైతులకు కరువు అనేది లేకుండా చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇవ్వన్ని జరుగాలంటే కారు గుర్త్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
– కాసోజు శంకరమ్మ
రైతులకు కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందని, అంత మంచి పనులు చేసిన బీఆర్ఎస్ను గెలిపించాలని అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ కోరారు. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే ఉత్తమ్ నియోజకవర్గానికి చేసిందేమిటో చెప్పి ఓట్లు అడగాలన్నారు. సాగు, తాగు నీరు, విద్య, వైద్యమే మనుషులకు ప్రధానమని వాటి లోటు లేకుండా అందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే సైదిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుగులోతు కృష్ణానాయక్, ఏఎంసీ మాజీ చైర్మన్ కడియం వెంకట్రెడ్డి, నాయకులు మాశెట్టి శ్రీహరి, మన్సూర్ అలీ, గుత్తికొండ వెంకటరమణారెడ్డి, కుక్కడపు గుర్వయ్య, ఏఎంసీ డైరెక్టర్లు పెండెం వీరయ్య, పిడమర్తి అంజి, కీతవారిగూడెం సర్పంచ్ కీత జ్యోతీరామారావు, సంకబుడ్డి నర్సయ్య, పోలేపల్లి ఆనంద్బాబు, మండవ నాగేశ్వర్రావు, దాసరి శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల నాయకులు యరగాని గుర్వయ్య, బెక్కం విజయ్, కార్యకర్తలు, పలు గ్రామాల ప్రజా ప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ప్రచారానికి అన్ని గ్రామాల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులిచ్చి స్వాగతం పలికారు. ముందుగా రాయినిగూడెంలో గల రామాలయంలో పూజలు నిర్వహించారు. పలు గ్రామాల్లో మహిళలు శానంపూడి సైదిరెడ్డిని పలకరించేందుకు, కరచాలనలు చేసేందుకు పోటీపడ్డారు.