కొండమల్లేపల్లి, అక్టోబర్ 27 : స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో దేవరకొండ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే నిత్యం అందుబాటులో ఉండి మరింత అభివృద్ధి చేస్తానని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం మండంలోని వడ్త్యాతండా, గాజీనగర్, చింతచెట్టుతండా కోల్ముంతల్పహాడ్, రామునిగుండ్లతండా, కొత్తబావి, కేశ్యాతండా, గుర్రపుతండా, దంజీలాల్తండా, గన్యానాయక్తండా, చెన్నారం, ఆంబోతుతండా గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.
ఒక్క చాన్స్ ఇవ్వండి అంటూ కాంగ్రెస్ నాయకులు కర్ణాటక ప్రజలను ప్రాథేయపడితే వారు నమ్మి ఓటేశారని, ఇప్పుడు రోడ్లపైకి వచ్చే దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్కు 11 సార్లు అధికారమిస్తే తెలంగాణను అన్ని రంగాల్లో వెనుక బాటుకు గురి చేసిందన్నారు. కొత్త సీసాలో పాత సారా అన్నట్లు కాంగ్రెస్ నేతలు మారి కొత్త వేషాలతో ప్రజలను మభ్య పెట్టేందుకు మరోసారి వస్తున్నారని, వీరి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
2014కు ముందున్న పరిస్థితులు, స్వరాష్ట్రంలో తొమ్మదిన్నరేండ్లలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకొని ప్రజలు ఆలోచించాలన్నారు. కేసీఆర్ భరోసా పేరిట బీఆర్ఎస్ మ్యానిఫెస్టో రూపొందించామని తిరిగి అధికారంలోకి రాగానే అందులోని 15 పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. రైతుబంధును రూ.16 వేలకు, ఆసరా పింఛన్లు రూ.5 వేలకు, దివ్యాంగులకు రూ.6 వేలకు పెంచుతామని, గ్యాస్ సిలిండర్ రూ.400కే అందిస్తామని, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.15 లక్షల వరకు వైద్యం అందిస్తామని, ప్రతి ఇంటి మహిళకు సౌభాగ్యలక్ష్మి పేరిట రూ.3 వేలు, ప్రతి కుటుంబాని ఆర్థిక భరోసాగా బీమా కల్పించనున్నట్లు చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పూటకొకటిగా ఎగిరి పోతున్నాయని, ఆరు నెలలకే కర్ణాటక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, మరి తెలంగాణలో ఆ పార్టీ ఇచ్చిన గ్యారంటీ హామీలను ప్రజలు ఎలా నమ్మాలో ఆ పార్టీ నాయకులను ప్రశ్నించాలని కోరారు. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశారని, రాష్ట్ర మరింత అభివృద్ధి చెందేలా మరోసారి బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లో ప్రజలు మూడు కిలోమీటర్లు దూరం వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నారని, అదే తెలంగాణలో సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధి చేసిన తాగునీరు, 24 గంటల కరెంట్ ఇస్తున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ లేని తెలంగాణ ఊహించుకోలేమని, బీఆర్ఎస్ను కాదని ఇతరులకు అవకాశం ఇస్తే రాష్ట్రం ఏర్పాటుకు పూర్వం ఉండే పరిస్థితి పునరావృతమవుతుందన్నారు. దేవరకొండ ఎమ్మెల్యేగా తాను ప్రజల మధ్యే ఉంటూ దేవరకొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, అనేక మార్పులు తెచ్చానని అన్నారు. అదే కాంగ్రెస్ నాయకులు కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే కనిపిస్తారన్నారు.
దేవరకొండ అభివృద్ధిని కొనసాగించేందుకు తనను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యానాయక్, గుత్తా అమిత్రెడ్డి, జడ్పీటీసీ సలహాదారుడు పస్నూరి యుగేంధర్రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్గౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమావత్ దస్రూనాయక్, యూత్ అధ్యక్షుడు రమావత్ తులసీరాం నాయక్, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, ఎంపీటీసీలు లక్కీదాస్, వస్కుల తిరుపతమ్మాకాశయ్య, సర్పంచులు వడ్త్యా బలరాం, పేట రమేశ్, కైకబద్దునాయక్, అరుణా శక్రునాయక్, జబ్బు యాదయ్య, రమావత్ జ్యోతీదస్రూనాయక్, అనితా రాములునాయక్, లలితా భీంసింగ్నాయక్, రమావత్ రాములు నాయక్, శ్రీను నాయక్, పంగా లాలయ్య, షేక్ ఇస్మాయిల్, వెంకటేశ్ పాల్గొన్నారు.