‘వ్యవసాయానికి 3 గంటలే కరెంట్ చాలంటున్న కాంగ్రెస్ మాకొద్దు.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల విద్యుత్తో ఏటా మూడు పంటలే మాకు ముద్దు.. బిడ్డ రేవంత్ రెడ్డీ ఒళ్లు జాగ్రత్త.. రైతులను మునుపటిలా చీకట్లోకి నెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీనే అంధకారంలోకి నెట్టేస్తం’ అని రైతులు గర్జించారు. బుధవారం రైతు వేదికల్లో విద్యుత్పై నిర్వహించిన సమావేశాల్లో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కరెంట్పై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించారు. విద్యుత్పై అడ్డగోలుగా వాగిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో ఎట్ల్ల తిరుగుతారో చూస్తామని హెచ్చరించారు. సమావేశం ఆఖర్లో రేవంత్ రెడ్డి రైతులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని తీర్మానాలు చేశారు. కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకుల రైతు వేదికలో దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, కట్టంగూరులో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, చింతలపాలెంలో హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు.
వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు అవసరం లేదు.. 3 గంటలు సరిపోతదన్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేకి రేవంత్రెడ్డి అని నినదించారు. కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వస్తే తరమికొడతామని హెచ్చరించారు. బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు రైతు వేదికల్లో జరిగిన రైతు సమావేశాలకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉచిత విద్యుత్పై రేవంత్రెడ్డి వ్యాఖ్యలను ముక్తకంఠంతో ఖండించారు. కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన 8 గంటల కరెంటు ఎప్పుడు వచ్చేదో, ఎప్పుడు పోయేదో తెలియని పరిస్థితి ఉండేదని మండిపడ్డారు. నాటు పెట్టిన అరెకరం, ఎకరం కూడా పారేది కాదని గుర్తుచేశారు. స్వరాష్ట్రంలో తొమ్మిదేండ్లుగా వ్యవసాయం పండుగలా సాగుతుందని, అది ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా రేవంత్రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చీకటిమామిడిలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, వలిగొండ మండలం ప్రొద్దుటూరులో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, కట్టంగూర్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, చింతలపాలెంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు.
చింతలపాలెం, జూలై 19 : రైతులంటే రేవంత్కు కడుపు మంట అని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులతో సమావేశం నిర్వహించి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు నిందలు మోపుతున్నాయన్నారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయానికి తొమ్మిది గంటల కరెంటు కూడా ఇవ్వకుండా రైతుల ఉసురుపోసుకుందన్నారు. ఇలాంటి కాంగ్రెస్ కావాలా. 24 కరెంట్ ఇస్తూ రైతులకు మేలు చేస్తున్న బీఆర్ఎస్ కావాలా? రైతులు ఆలోచించాలన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేస్తున్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. వీటిని జీర్ణించుకోలేక టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కరెంటుపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వానిది మూడు పంటల నినాదమైతే, కాంగ్రెసోళ్లది మూడు గంటల కరెంటు నినాదమని పేర్కొన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అవసరం లేదని, 3 గంటలు మాత్రమే సరిపోతుందని రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పాతాళంలో పాతి పెట్టాలని సూచించారు. సమావేశంలో ఎంపీపీ కొత్తమద్ది వెంకట్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మదిర సత్యనారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్రావు, ఎంపీటీసీలు సైదిరెడ్డి, మహత్యం, నాయకులు మైబెల్లి, రామకోటిరెడ్డి, శ్రీనివాస్, గోవిందరెడ్డి, సుబ్బారావు, ఘనీ, వెంకట్, సుబ్బయ్య, రంగారెడ్డి, వెంకటరంగారెడ్డి, రైతులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకులను గ్రామాల నుంచి బహిష్కరించాలి
రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాల నుంచి బహిష్కరించాలి. ఎన్నడూ రైతుల బాధలు పట్టని కాంగ్రెస్ నాయకులు రైతులకు లబ్ధి కల్గించే పథకాలను వద్దనడం సిగ్గు చేటు. ఓట్ల కోసం కాంగ్రెస్ నాయకులు చేస్తున్న జిమ్మిక్కులను రైతులు అర్థం చేసుకోవాలి. రైతులను అవమానించే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో రైతులంతా తగిన బుద్ధి చెప్పాలి.
-పైళ్ల లక్ష్మారెడ్డి, రైతు, పక్కీర్గూడ, బొమ్మలరామారం
ఇప్పుడిప్పుడే ఆర్థికంగా బలపడుతున్నాం
నాకు ఆరు ఎకరాల భూమి ఉన్నది. గత పాలకుల హయాంలో రోజుకు తొమ్మది గంటల విద్యుత్ ఇస్తే సరిపోయేది కాదు. రేవంత్రెడ్డి ఇప్పుడు మూడు గంటల కరెంట్ ఇస్తే చాలనడం ఎంతవరకు సబబు. సీమాంధ్ర ప్రభుత్వాల హయాంలో దివాలా తీసిన రైతులకు స్వారష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎరువుల కొరత లేకుండా చేశారు. చెరువులకు మరమ్మతులు చేయించారు. పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.10 వేలు అందిస్తున్నారు. రైతుబీమాతోపాటు వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తున్నరు. దాంతో రైతులంతా ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఇలాంటి సమయంలో రేవంత్రెడ్డి మూడు గంటల కరెంటు చాలనడం ఆయనకు వ్యవసాయంపై ఉన్న పరిజ్ఞానం ఏపాటిదో తెలుస్తుంది. సీఎం కేసీఆర్ పుణ్యమాని ఇప్పుడు కరెంటు బాధలు తప్పినయి. ఎప్పుడంటే అప్పడు పొలాలకు నీళ్లు పారిస్తున్నాం. మోటర్లకు మరమ్మతులు లేకుండా పోయినయ్. ఇప్పుడు రైతులంతా దర్జాగా బతుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడి రైతుల జీవితాలతో ఆడుకోవద్దు.
-రమావత్ మంతూనాయక్, రైతు, పిల్యతండా, కొండమల్లేపల్లి
బీఆర్ఎస్ పాలనలోనే సంతోషంగా రైతులు
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులు కరెంట్ కోసం ఎన్నో ఇబ్బందులు పడేవారు. ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం రైతులు సంక్షేమం కోసం 24 గంటల ఉచిత విద్యుత్ను సరఫరా చేస్తూ వారు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు కృషి చేస్తున్నది. గత ప్రభుత్వాల హయాంలో రైతులకు కన్నీళ్లు తప్ప మిగిలిందేమీ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ 9 ఏండ్ల పాలనలో రైతులు పండించిన పంటలతో రాష్ట్రం, సుభిక్షంగా, సస్యశ్యామలంగా మారింది.
– గండారపు వెంకట్రావ్, గుడిమల్కాపురం, చింతలపాలెం
నాడు ఎరకం పారలే.. నేడు ఆరెకరాలు పారిస్తున్నా
నాకు 7ఎకరాల భూమి ఉంది. కాంగ్రెస్ పార్టీ హయాంలో 9 గంటల కరెంటు ఇస్తామని చెప్పి 5 గంటలు కుడా నిరంతరాయంగా సరఫరా చేయలేదు. రాత్రిపూట బావుల వద్ద కరెంట్ కోసం నానా ఇబ్బందులు పడ్డాం. నేడే సీఎం కేసీఆర్ నిరంతరం నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తుండడంతో ప్రస్తుతం ఆరెకరాలు సాగు చేస్తున్నా. ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాల గురించి రైతులకు వివరిస్తా.
-చిమ్ముల వెంకట్రెడ్డి, రైతు, ప్యారారం, బొమ్మలరామారం
24 గంటల కరెంట్తో కష్టాలు తీరినయి
రాష్ట్ర ప్రభుత్వ అందిస్తున్న 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాతో రైతులు కష్టాలు తీరిపోయాయి. గతంలో నిర్ణీత వేళలు పాటించకుండా హైఓల్టేజ్, లోఓల్టేజ్ సమస్యతో నిత్యం మోటర్లు కాలిపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్లం. ఇప్పుడు కరెంట్ సమస్యలు పూర్తిగా తొలిగిపోయినయి. వ్యవసాయంలో కరెంట్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-జెజ్జెంకి పాపిరెడ్డి, రైతు, బొమ్మలరామారం