యాదాద్రి భువనగిరి, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ భువనగిరి పార్లమెంట్లో కొత్త నినాదం రాజకీయాలను రక్తి కట్టిస్తున్నది. ఆ పార్టీలో మళ్లీ బీసీ రాగం తెరపైకి వచ్చింది. ఎంపీ సీటు బీసీలకే ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తున్నది. తాజాగా లోక్సభ టికెట్ బీసీలకే ఇవ్వాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొత్త రాగం అందుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ నాటి ఎంపీ, ప్రస్తుతం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలు బీసీలకే టికెట్ ఇవ్వాలని బలంగా పట్టబట్టి చివరలో చేతులెత్తేశారు. కాంగ్రెస్ రాజకీయ ఆటలో తమను పావుల్లా మార్చేస్తున్నారని బీసీ సమాజం మండిపడుతున్నది.
లోకసభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ను విడుదల చేసింది. వచ్చే నెలలో నోటిఫికేషన్ రిలీజ్ కానున్నది. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నల్లగొండ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ, భువనగిరి స్థానాన్ని మాత్రం పెండింగ్లో పెట్టింది. సీటు కోసం పలువురు నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన అన్న కొడుకు పవన్ రెడ్డిని, రాజగోపాల్ రెడ్డి తన భార్య లక్ష్మిరెడ్డిని బరిలో నిలుపాలని వేర్వేరుగా లాబీయింగ్ చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. వీరితోపాటు మరికొందరు కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. హఠాత్తుగా రాజగోపాల్ రెడ్డి మాత్రం బీసీలకు టికెట్ ఇవ్వాలని మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. అసలు బీసీ నేతల పేర్లే పెద్దగా పరిశీలనలో లేవు. అలాంటిది ఒక్కసారిగా బీసీ రాగం ఎత్తుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
భువనగిరి అసెంబ్లీ సీటును బీసీలకే ఇవ్వాలని మొదటి నుంచి కాంగ్రెస్లోని ఓ వర్గం పట్టుబడుతూ వచ్చింది. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సైతం బీసీలకే ఇవ్వాలని ప్రకటించారు. బీసీ నినాదంతో అప్పటికే క్షేత్రస్థాయిలో దూసుకెళ్తున్న కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం జరిగింది. ఆయనకు వ్యతిరేకంగా కొందరు హస్తం పార్టీలోని సీనియర్ బీసీ నేతలు ఫంక్షన్ హాల్లో రహస్యంగా సమావేశాలు నిర్వహించారు. కొందరు బహిరంగంగానే డిమాండ్ చేశారు.
కుంభంకు వ్యతిరేకంగా ముందుకెళ్లారు. దాంతో కాంగ్రెస్లో సొంతింటి పోరు తట్టుకోలేక కుంభం పార్టీ మారడం, తర్వాత తిరిగి సొంత గూటికి చేరడం జరిగిపోయాయి. అప్పటి వరకు బీసీ నినాదం ఎత్తుకున్న నేతలంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. ఆఖరికి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ దక్కింది. పార్లమెంట్ పరిధిలో ఇద్దరు బీసీలకు టికెట్ ఇవ్వాలన్న కాంగ్రెస్ డిక్లరేషన్ను తుంగలో తొక్కారు.
కాంగ్రెస్ అంటేనే రెడ్ల పార్టీ అని ముద్ర ఉన్నది. అలాంటి పార్టీ బీసీలను ఆటలో పావులా మార్చేస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయాలకు అవసరం వచ్చిన ప్రతి చోటా బీసీలను ఎరగా వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే జరిగింది. బీసీలను ముందు పెట్టి.. అగ్రవర్ణాల నేతలు లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరికి బీసీ నేతలను రాజకీయ ఆటలో బలి చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే స్పష్టంగా కనిపిస్తున్నది. దీనిపై బీసీ సమాజం పెద్దఎత్తున మండిపడుతున్నది. నిజంగా బీసీలకు టికెట్ ఇస్తే స్వాగతిస్తామని, కానీ బీసీల పేరుతో రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు.
భువనగిరి పార్లమెంట్ టికెట్ కోసం ఇప్పటి వరకు బీసీ కార్డు ఉపయోగించ లేదు. టికెట్ రేసులో ఉన్నోళ్లంతా రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. వారిలో చామల కిరణ్కుమార్ రెడ్డి, కీర్తి రెడ్డి, కోమటిరెడ్డి లక్ష్మి, సూర్యపవన్ రెడ్డి తదితర పేర్లు ఉన్నాయి. పున్న కైలాష్ నేత పేరు మొదట్లో వినిపించినా తర్వాత సైలెంట్ అయ్యిందని చెప్పవచ్చు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడే ఎందుకు తెరపైకి తెచ్చారనేది రాజకీయాల్లో హాట్హాట్గా చర్చ నడుస్తున్నది.