– సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు
కోదాడ, మే 08 : కోదాడ అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న ప్రభుత్వ ఆస్తుల కబ్జాలపై ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి తక్షణమే స్పందించాలని సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అనేక గ్రామాలలో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూముల్లో ఉన్న విలువైన మట్టిని టిప్పర్లతో తరలిస్తుంటే యువత అడ్డుకుని సాక్ష్యాలతో ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించడం లేదన్నారు. పట్టణంలో, మండల కేంద్రాల్లో జరుగుతున్న విలువైన భూముల, స్థలాల కబ్జాలపై ప్రసార మాధ్యమాలలో వస్తున్నప్పటికీ అధికారులు పట్టించకపోవడం దుర్మార్గమన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా బాధ్యతగా ప్రజలకు చెందిన ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన నైతిక బాధ్యత ఆమెపై ఉందన్నారు. అక్రమార్కులు నిస్సంకోచంగా, బహిరంగంగా కబ్జాలకు పాల్పడుతున్నప్పటికీ అధికారులు నోరు మెదపడం లేదన్నారు. బాధ్యత గల ఎమ్మెల్యేగా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.